
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది.
నాలుగు మండలాల్లో విస్తారంగా నిమ్మ సాగు
తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పుట్లూరు మండలాలతోపాటు వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని రైల్వే కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో నిమ్మ సాగు విస్తారంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి తాడిపత్రిలోని మార్కెట్ యార్డుకు నిమ్మ కాయలను మంగళ, శుక్ర, ఆదివారాల్లో రైతులు తీసుకువస్తుంటారు. బస్తాలో 1,000 నుంచి 1,100 వరకు నిమ్మకాయలు ఉంటాయి. కాయ నాణ్యత, సైజును బట్టి మూడు రకాలుగా విభజించి వేలం వేస్తారు. వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ ధర గిట్టుబాటు కాకపోతే రైతులు జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు.
మార్కెట్లో తగ్గిన నిమ్మకాయల ధరలు..
గత ఏడాది ఇదే సమయానికి నిమ్మ ధరలు రైతులకు కాస్త వెసులుబాటుగా ఉండేది. అప్పట్లో బస్తా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అమ్ముడు పోయింది. ఈ ఏడాది రుతు పవనాలు వారం రోజులు ముందుగా జిల్లాను పలకరించాయి. దీంతో ఆకాశం మబ్బులు కమ్ముకోవడం, వాతావరణ పరిస్థితులు చల్లబడటంతో నిమ్మ ధరలు అమాంత పడిపోయినట్లుగా తెలుస్తోంది.
బస్తా రూ.5వేల నుంచి
రూ.1,500 లోపు
ఆందోళనలో రైతులు
మరింత తగ్గుతాయి
నేను తాడిపత్రిలోని మార్కెట్లో డైలీ నిమ్మకాయలు అమ్ముతుంటాను. గత నెలలో రూ.20కి 5 కాయలు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.10కే 5 కాయలు ఇస్తున్నాం. పరిస్థితి చూస్తుంటే నిమ్మకాయల ధరలు మరింత తగ్గే అవకాశముంది.
– రసూల్బీ, వ్యాపారి, తాడిపత్రి

పడిపోయిన నిమ్మ ధరలు