
ఏడాదిన్నర నిరీక్షణకు తెర
● తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు పునఃప్రారంభం
రాయదుర్గంటౌన్: మరమ్మతులు, అభివృద్ధి పనుల పేరిట దాదాపు ఏడాదిన్నరగా రద్దు చేస్తూ వస్తున్న తిరుపతి – కదిరిదేవరపల్లి రైలుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రాయదుర్గం ప్రాంత ప్రజలకు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ రైలు అందుబాటులోకి రానుంది. రాయదుర్గం – తుంకూరు మార్గంలో ట్రాక్ పనులు పూర్తయిన కదిరిదేవరపల్లి వరకు నడుపుతున్న ఏకై క రైలును సైతం రద్దు చేస్తూ వస్తుండడంతో ఈ ప్రాంత ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. ఈ రైలు ఇప్పటి దాకా గుంతకల్లు వరకు రాకపోకలకు సాగించేది. 2023 నవంబర్ నుంచి ఈ రైలును రెండు నెలలు, మూడు నెలల పాటు పాక్షికంగా రద్దు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జూన్ 1న కదిరిదేవరపల్లికి ఈ రైలు (57405) తిరుపతిలో బయల్దేరుతుందని, అలాగే రెండో తేదీన కదిరిదేవరపల్లిలో (57406) రాయదుర్గం మీదుగా తిరుపతికి బయల్దేరుతుందని నైరుతి రైల్వే అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ బీఎల్ శివకుమార్ తెలిపారు. రోజూ తిరుపతిలో రాత్రి బయల్దేరి గుంతకల్లు, బళ్లారి మీదుగా రాయదుర్గానికి 11.03 గంటలకు చేరుకుంటుందని, అలాగే కదిరిదేవరపల్లి నుంచి బయల్దేరే ఈ రైలు కళ్యాణదుర్గం మీదుగా రాయదుర్గం స్టేషన్కు మధ్యాహ్నం 3.49 గంటలకు చేరుకుంటుందన్నారు.