
సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం అర్బన్: మెప్మా, గ్రంఽథాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ సజావుగా జరిగింది. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మెప్మా, గ్రంథాలయ శాఖ ఉద్యోగుల కౌన్సెలింగ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ వేర్వేరుగా నిర్వహించారు. మెప్మాలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించి లైబ్రేరియన్ గ్రేడ్–3, రికార్డ్ అసిస్టెంట్, కార్యాలయ సహాయకుల బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టారు. కార్యక్రమంలో మెప్మా పీడీ జె.విశ్వజ్యోతి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పామిడి తహసీల్దార్,
వీఆర్వోకు నోటీసులు
పామిడి: మండలంలోని అప్పాజీపేట గ్రామంలో సర్వే నంబర్ 178–బీలోని 10 ఎకరాల భూమి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన తహసీల్దార్ ఎన్. శ్రీధర్మూర్తి, వీఆర్వో జ్యోతికి ఉన్నతాధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఆ పొలానికి సంబంధించి గత నెల మార్చి7న గ్రీవెన్స్లో అర్జీ వచ్చింది. దీనిపై బుధవారం కలెక్టర్ వినోద్కుమార్ అర్జీదారునికి ఫోన్ చేశారు. భూమి విషయంపై సంబంధిత వీఆర్వో, తహసీల్దార్తోనూ ఆయన ఫోన్లో మాట్లాడారు. సదరు 10 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, దీన్ని ఇరువురు ఆక్రమించుకొని అనుభవిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమి అని తెలిసినా స్వాధీనం చేసుకోవడంలో అలసత్వం ప్రదర్శించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీధర్మూర్తికి కాషన్ నోటీసు, వీఆర్వో జ్యోతికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పీజీఆర్ఎస్ తహసీల్దార్ను ఆదేశించారు. భూమి ఆక్రమణదారులపై 22 రోజుల్లో చర్యలు చేపట్టాలని సూచించారు.
‘రెవెన్యూ’లో బదిలీలకు 313 దరఖాస్తులు
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో బదిలీ కోసం 313 మంది అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్నారు. 16 మంది తహసీల్దార్లు, 44 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 12 మంది రీ–సర్వే డిప్యూటీ తహసీల్దార్లు, 38 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఐదుగురు, గ్రేడ్–1 వీఆర్ఓలు 68 మంది, గ్రేడ్–2 వీఆర్ఓలు 113 మంది, అటెండర్లు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు.
‘సూపర్’లో
మూడు రోజులు ఓపీ సేవలు
అనంతపురం మెడికల్: రోగులకు స్పెషాలిటీ వైద్యాన్ని విస్తృతం చేయడంలో భాగంగా జూన్ 2 నుంచి వారంలో మూడు రోజుల పాటు ఓపీ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వ రావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతి సోమ, గురు, శనివారాల్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరో సర్జరీ, సీటీపీ, ప్రతి మంగళ, బుధ, శనివారాల్లో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, ప్రతి సోమ, బుధ, శనివారాల్లో నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ విభాగాల ఓపీ ఉంటుందని పేర్కొన్నారు.
నేటి నుంచి
విత్తన వేరుశనగ రిజిస్ట్రేషన్లు
అనంతపురం అగ్రికల్చర్: విత్తన వేరుశనగ కోసం శుక్రవారం నుంచి రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. ఈ ఏడాది జిల్లాకు కేవలం 50,592 క్వింటాళ్లు కేటాయించారు. 40 శాతం రాయితీ ప్రకటించారు. కే–6 రకం 46,692 క్వింటాళ్లు, కదిరి–లేపాక్షి (కే–1812) రకం 900, టీసీజీఎస్–1694 రకం 3 వేల క్వింటాళ్లు మండలాలకు అలాట్ చేశారు. కే–6, టీసీజీఎస్–1694 రకం క్వింటా పూర్తి ధర రూ.9,300 కాగా రాయితీ రూ.3720 పోనూ రైతుల వాటా రూ.5,580గా ఖరారు చేశారు. కే–1812 రకం ధర రూ.8,200 కాగా రాయితీ రూ.3,280 పోనూ రైతులు తమ వాటా కింద రూ.4,920 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

సజావుగా బదిలీల కౌన్సెలింగ్