
జిల్లా కేంద్రానికి దారి చూపండి
శింగనమల: నియోజకవర్గ కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి దారి చూపాలంటూ శింగనమల వాసులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దాదాపు 45 నిమిషాల పాటు ‘544డీ’ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. దీంతో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్రావు, సీఐ కౌలుట్లయ్య, ఏఎస్ఐ చితంబరయ్య అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా శింగనమల నుంచి అనంతపురానికి రాకపోకలు సాగించేందుకు ఏకై క మార్గం మరువకొమ్మ మీదుగానే ఉండేదని గుర్తు చేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ రహదారిని మూసి వేసి, మరువకొమ్మ నుంచి తాడిపత్రి వైపుగా ఉన్న పెద్దమ్మ గుడి వద్ద క్రాసింగ్ ఇచ్చారన్నారు. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో మరువకొమ్మ క్రాస్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే శింగనమల నుంచి అనంతపురానికి రాకపోకలు సాగించే మార్గాన్ని మూసి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెద్దమ్మ గుడి వద్ద చోటు చేసుకున్న ప్రమాదాల్లో కొందరు మృత్యువాత పడ్డారన్నారు. జాతీయ రహదారి మార్గంలో ఉన్న చిన్నపాటి గ్రామాలైన రెడ్డిపల్లి, రోటరీపురం,కొర్రపాడు వద్ద రెండు బ్రిడ్జిలు, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, పెరవలి, నాయనపల్లి క్రాస్లో అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించారని, అయితే నియోజకవర్గ కేంద్రమైన శింగనమలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ ఆందోళనను విరమించబోమని భీష్మించారు. సీఐ కౌలుట్లయ్య, డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్రావు మాట్లాడుతూ.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చొరవ తీసుకుంటామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు.
శింగనమల మరువకొమ్మ వద్ద గ్రామస్తుల ధర్నా
అధికారుల హామీతో ఆందోళన విరమణ