
బాసిజం... బానిసత్వం ఈ రెండూ నాటికి, నేటికీ రెవెన్యూ శాఖ
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో కీలకంగా ఉండే రెవెన్యూ శాఖ అన్నింటికీ భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఈ శాఖలో ఉన్నతాధికారుల బాసిజానికి కింది స్థాయి ఉద్యోగులు బానిసలుగా మారక తప్పడం లేదు. ముఖ్యంగా బదిలీల ప్రక్రియలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా బయటపడుతోంది. అన్ని శాఖల్లోలా ఇక్కడి ఉద్యోగులకు బదిలీలకంటూ ప్రత్యేక కౌన్సెలింగ్ ఉండక పోవడమే ఇందుకు నిదర్శనం. బదిలీ కోసం స్థానాల ఆప్షన్లతో దరఖాస్తు చేసుకోవడం వరకే ఉద్యోగుల వంతు.. అటు తర్వాత ఆ స్థానానికి వారిని బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం అనేది అధికారుల చేతుల్లో ఉంటుంది. ఆప్షన్ ప్రకారం ఇవ్వచ్చు... లేదా ఇవ్వని స్థానానికి బదిలీ చేయవచ్చు. ‘ఎందుకు?... ఏమిటి?... ఎలా?’ అని మాత్రం ప్రశ్నించకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వారు ‘చుక్కలు’ చూడాల్సిందే. ఇక ‘మేనేజ్’ చేసుకునే సామర్థ్యం ఉన్నవారు కోరిన చోట పోస్టింగ్ పొందవచ్చు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు... సాక్షాత్తూ బానిసత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న రెవెన్యూ ఉద్యోగులే కావడం గమనార్హం.
అన్ని స్థాయిల్లోనూ బాసిజం
రెవెన్యూ శాఖలో గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయి వరకు బాసిజం ఏ స్థాయిలో ఉందో అంతకంటే ఎక్కువ స్థాయిలో బానిసత్వమూ కనిపిస్తోంది. గ్రామ స్థాయి అధికారి తన కింద వారిపై బాసిజం చూపిస్తూ.. పైవారు ఏది చెప్పినా కాదనకుండా చేస్తారు. మండలస్థాయి అధికారి తన కింద వారిపై బాసిజం చూపిస్తారు. డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఏది చెప్పినా (ఆర్థిక, ఆర్థికేతర) కిమ్మనకుండా ఆగమేఘాలపై చేసి పెడతారు. ఒక ఆదేశం జిల్లా స్థాయి అధికారి నుంచి డివిజన్ స్థాయి అధికారికి వస్తే... ఆ ఆదేశం వెంటనే మండల స్థాయికి... అక్కడి నుంచి గ్రామ స్థాయికి వెళుతుంది. ఎలా చేస్తారు? అనేది పైవారికి అవసరం లేదు. వారు చెప్పింది చేయాలి... చేయకపోతే ‘సినిమా’ చూడాల్సిందే.
ఇక్కడ నో కౌన్సెలింగ్
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులకు బదిలీల సమయంలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ప్రకియ అనేది నిర్వహించడం పరిపాటి. అదికూడా ఉద్యోగుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తుంటారు. చివరికి పోలీసు శాఖలోనూ కౌన్సెలింగ్ నిర్వహించి జాబితాలో చూపించిన ఖాళీల్లో వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తుంటారు. ఇక మెప్మా, గ్రంథాలయ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్ను స్వయంగా జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. అయితే రెవెన్యూశాఖలో ఈ విధానం భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కౌన్సెలింగ్ విధానం లేదు. బదిలీలు చేయడంలోనూ అధికారుల బాసిజమే పనిచేస్తుంది. అధికారులు బదిలీ చేసిన స్థానాలకు మారుమాట్లాడకుండా ఉద్యోగులు వెళ్లాల్సిందే.
స్టేషన్ అమలు కాదు...
రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ మొత్తం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. ప్రధానంగా ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి అనే నిబంధన విషయంలో ‘స్టేషన్’ అమలు కాదు. ముఖ్యంగా గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ) బదిలీల క్రమంలో మండలం స్టేషన్గా తీసుకోకుండా... గ్రామం స్టేషన్గా తీసుకుంటున్నారు. దీంతో పలువురు వీఆర్ఓలు ఒక మండలంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి బదిలీ అవుతున్నారే తప్ప ఆ మండలం వీడడం లేదు. ఇక డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు విషయంలో డివిజన్ స్టేషన్గా తీసుకోవడం లేదు. దీంతో వారు కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దారు, పౌర సరఫరాల కార్యాలయాల్లో... ఇలా ఇక్కడిక్కడే పోస్టింగ్ పొందుతూ ఒకే స్టేషన్లో ఏళ్లుగా పాతుకుపోతున్నారు. ఈ విమర్శలు రెవెన్యూ వర్గాల నుంచే వస్తుండం గమనార్హం.
రెవెన్యూ శాఖలో అన్ని స్థాయిల్లోనూ ఇదే తీరు
బదిలీల్లోనూ ఇదే వైఖరి
ఉద్యోగులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ అంటూ లేదు
అధికారులు పోస్టింగ్ ఇచ్చిన చోటుకు వెళ్లాల్సిందే