
చిత్ర విచిత్రాలు.. టీచర్ల గగ్గోలు
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీ దరఖాస్తులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరికి ఏ పాయింట్లు నమోదవుతున్నాయో, అవి ఎప్పుడు తొలగిపోతాయో అంతుచిక్కడం లేదు. దీంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. బదిలీల దరఖాస్తు ప్రక్రియను సాంకేతికపరమైన సమస్యలు చుట్టుముట్టాయి. దరఖాస్తు చేసిన సమయంలో నమోదు చేసిన పాయింట్లు హార్డ్కాపీ ప్రింట్ తీసుకునేలోపు మాయమవుతున్నాయి. పాఠశాల ఒక కేటగిరీ కింద ఉంటే...వెబ్సైట్లో మరో కేటగిరీ పాయింట్లు కనిపిస్తున్నాయి. రీ అపోర్షన్కు గురైన టీచర్లకు స్పెషల్ పాయింట్లు కనిపించడం లేదు. జనరేట్ అయిన స్పౌజ్ ప్రత్యేక పాయింట్లు గల్లంతయ్యాయి. గార్లదిన్నె మండలంలో ఓ గణితం టీచరుకు దరఖాస్తు చేసుకున్న రోజు 43.4898 పాయింట్లు చూపించగా రెండోరోజు 43.4713 పాయింట్లు, మూడోరోజు (ఆదివారం) 38.4713 పాయింట్లు చూపిస్తోంది. ఇక సోమవారం (నేడు) ఎన్ని పాయింట్లు కనిపిస్తాయోనని సదరు టీచరు బెంబేలెత్తుతున్నారు. చివరకు కొందరు ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసిన ఫారాలు కూడా వెబ్సైట్లో కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ‘టీచర్ల బదిలీ చట్టం–2025’ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ టీచర్లకు సమస్యగా మారింది. దరఖాస్తు గడువు ముంచుకొస్తుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి అనంతపురంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న శారదా స్కూల్కు పరుగులు పెడుతున్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారం తమ పరిధిలో లేదంటూ ఇక్కడి అధికారులు స్పష్టం చేస్తున్నారు.
హెచ్ఎం దరఖాస్తులు మాయం..
ఆన్లైన్లో దరఖాస్తు చేసి... హార్డ్కాపీలు ప్రింట్ తీసుకుని అధికారులకు అందజేసి నిర్ధారణ చేసిన తర్వాత కొందరు హెచ్ఎంల పేర్లు తాత్కాలిక సీనియార్టీ జాబితాలో కనిపించలేదు. తాడిపత్రి మండలం చుక్కలూరు జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం సి.సుధాకర్ ఈనెల 21న ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. డౌన్లోడ్ చేసుకుని 22న గుత్తి డీవై ఈఓకు సబ్మిట్ చేశారు. ఆన్లెన్ దరఖాస్తు అటు డీవైఈఓ లాగిన్లోనూ, ఇటు డీఈఓ లాగిన్లోనూ కనిపించలేదు. ఈలోగా గడువు ముగిసి తాత్కాలిక సీనియార్టీ జాబితా విడుదలైంది. ఇందులో సుధాకర్ పేరే లేదు. డీఈఓను కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. కాగా సుధాకర్ రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అదే తప్పనిసరి బదిలీ అయి ఉండి ఇలా ఆన్లైన్లో దరఖాస్తు కనిపించకపోతే పెద్ద సమస్య అయ్యేదని టీచర్లు చెబుతు న్నారు. మరో 10 మందిదాకా హెచ్ఎంలు సుధాకర్ లాంటి సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.
టీచర్ల బదిలీ ఆన్లైన్ దరఖాస్తులో
సాంకేతిక సమస్యలు
మాయమైపోతున్న పాయింట్లు
ఉన్న పాయింట్లు చూపని వెబ్సైట్
చివరకు దరఖాస్తులూ కనిపించని వైనం
డీఈఓ కార్యాలయం చుట్టూ ఉపాధ్యాయుల ప్రదక్షిణలు
తమ చేతుల్లో లేదంటున్న అధికారులు
స్కూల్ 3వ కేటగిరీ.. పాయింట్లు ఒకటో కేటగిరీవి..
శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం టీచరు బి.రామాంజనేయులు 8 ఏళ్లు పూర్తి కావడంతో తప్పనిసరి బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. అగ్రహారం జెడ్పీహెచ్ఎస్ 3వ కేటగిరీలో ఉంది. అంటే ఏడాదికి మూడు పాయింట్ల చొప్పున 24 పాయింట్లు రావాల్సి ఉంది. ఆన్లైన్లో ఈ స్కూల్ కేటగిరీ–1లో ఉన్నట్టు చూపిస్తోంది. కేటగిరీ–1కు ఏడాదికి ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. ఈ లెక్కన మొత్తం 8 పాయింట్లు మాత్రమే చూపిస్తోంది. మూడు రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... ఏ ఒక్కరూ స్పందించడం లేదని రామాంజనేయులు వాపోతున్నారు.