
ఇదేం తాగుడు బాబోయ్..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన సొమ్ములో సగం మద్యానికి ఖర్చు చేస్తున్నారు. ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు కావడంతో మద్యం ప్రజల చెంతకే వెళ్లినట్టయింది. దీంతో వినియోగం కూడా భారీగా పెరిగింది. రోజుకు రూ.4.60 కోట్ల విలువ చేసే మద్యం తాగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. సరిగ్గా 8 నెలల క్రితం చంద్రబాబు సర్కారు కొత్త మద్యం పాలసీని అందుబాటులోకి తెచ్చింది. అప్పటినుంచి శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మద్యం ఏరులై పారుతోంది.
రూ.1,100 కోట్లు దాటింది...
గడిచిన ఎనిమిది మాసాల్లో అంటే 2024 సెప్టెంబర్ 15 నుంచి మే 15 వరకూ రూ.1,100 కోట్ల మద్యం వినియోగించారు. అంటే సగటున రోజుకు రూ.4.58 కోట్ల మద్యం తాగుతున్నారు. అనంతపురం జిల్లాలో 1,200కు పైగా, శ్రీ సత్యసాయి జిల్లాలో 750కి పైగా మద్యం షాపులు ఉన్నాయి. ఇవి కాకుండా అర్బన్ ప్రాంతాల్లో పర్మిట్ రూములు ఏర్పాటు చేశారు. గల్లీ గల్లీకి, గ్రామ గ్రామానికి మద్యాన్ని అందుబాటులోకి తేవడం, బహిరంగ మద్యపానంపై ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల మద్య సేవనం విచ్చలవిడిగా మారింది.
కూరగాయల షాపులకంటే
మద్యం షాపులే ఎక్కువ..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూరగాయలు అమ్మే షాపుల కంటే మద్యం షాపులు, బెల్టుషాపులు, పర్మిట్ రూములే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలే లిక్కర్ షాపులు నిర్వహిస్తుండటంతో విక్రయాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వేళా పాళా ఉండటం లేదు. ఉదయం 6 గంటలకే మద్యం షాపులు తెరుస్తున్నారు. గుడులు, బడులు, ఆస్పత్రులు ఏమీ లెక్క చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. ఇదిలాఉంటే.. మద్యం విచ్చలవిడి అమ్మకాల వల్ల నేరాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దీన్నే ‘లిక్కర్ బేస్డ్ క్రైమ్’గా పోలీసులు చెబుతున్నారు. తాగిన మత్తులో ఇతరులపైనా, కుటుంబ సభ్యులపైనా, భార్యల పైనా దాడులకు దిగడం ఎక్కువైంది. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 8 నెలల్లోనే రూ.1,100 కోట్ల విలువైన మద్యం అమ్ముడుబోవడం రికార్డు అని నిపుణులు చెబుతున్నారు.
8 నెలల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు
రూ.1,100 కోట్ల మద్యం వినియోగం

ఇదేం తాగుడు బాబోయ్..