
అన్నదాతను నిండా ముంచారు..
ఉరవకొండ: హంద్రీ–నీవా కాలువ పనుల్లో భాగంగా కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు పంట నష్టపోయాడు. వివరాలు.. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ సమీపంలో హంద్రీ–నీవా 22వ కిలోమీటరు వద్ద కాలువ పనులు జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన పి.శ్రీనివాసులు సర్వే నంబర్ 282–1బీలో తనకున్న 5 ఎకరాల్లో 2 నెలల క్రితం వేరుశనగ పంట సాగు చేశాడు. పంట పెట్టుబడుల కోసమని రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హంద్రీ–నీవాలో భారీగా నీరు చేరింది. దీంతో పనులకు అంతరాయం కలగడంతో ఆదివారం కాలువకు కాంట్రాక్టర్ గండి కొట్టి పక్కనే ఉన్న పి.శ్రీనివాసులు పొలంలోకి నీటిని వదిలాడు. దీంతో పంట మొత్తం నీట మునిగింది. విషయం తెలుసుకున్న రైతు అక్కడకు చేరుకుని సైట్ ఇంజినీర్ చంద్రతో మాట్లాడితే.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ.. టీడీపీ నేతలే గండి కొట్టమని చెప్పారని, ఎవరితోనైనా చెప్పుకో పొమ్మంటూ దురుసుగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించాలని, తనకు పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధిత రైతు విన్నవించాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జాఫర్, ఓ.నల్లప్ప, కౌలు రైతు సంఘం నాయకులు బాలరంగయ్య స్పందించారు. బాధిత రైతుకు పరిహారం చెల్లించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హంద్రీ–నీవా పనుల్లో ఇష్టారాజ్యం
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐదెకరాల్లో
నీట మునిగిన వేరుశనగ పంట

అన్నదాతను నిండా ముంచారు..