
సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ
అనంతపురం అర్బన్/అనంతపురం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింది. ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు, మొబైల్ ఫోన్లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కేంద్రాలకు సమీపంలో జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేయించారు. కాగా.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా సాగిన పరీక్షలో అభ్యర్థుల హాజరు 59.50 శాతంగా నమోదైంది. 2,546 మంది హాజరవ్వాల్సి ఉండగా ఉదయం పేపర్–1 పరీక్షకు కేవలం 1,522 మంది హాజరయ్యారు. 1,024 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,515 మంది హాజరుకాగా 1,031 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు ఎంఎం నాయక్, కలెక్టర్ వి.వినోద్కుమార్, జేసీ శివ్ నారాయణ్ శర్మ పరిశీలించారు.
59.50 శాతం అభ్యర్థుల హాజరు
ప్చ్.. అదృష్టం లేదు!
యూపీఎస్సీ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరీక్ష సమయాని కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేస్తూ వచ్చారు. ఉదయం 9 తరువాత, మధ్యాహ్నం 2 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. అయితే ఆదివారం కొందరు అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రాలకు వచ్చారు. ఎస్ఎస్బీఎన్ కళాశాల కేంద్రంలో పరీక్షకు హాజరవ్వాల్సిన కదిరికి చెందిన షర్మిల, కర్నూలుకు చెందిన కిరణ్, అనంతపురం నగరానికి చెందిన స్రవంతి ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. మరికొన్ని కేంద్రాల్లోనూ ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి పంపలేదు.

సజావుగా సివిల్స్ ప్రిలిమినరీ