
రూ.3 లక్షల వరకు ఏపీజీబీ పంట రుణాలు
● ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు ఆర్ఎం శ్రీదేవి
అనంతపురం అగ్రికల్చర్ : రైతులకు రూ.3 లక్షల వరకు పంట రుణాలు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (పూర్వ ఏపీజీబీ) రీజనల్ మేనేజర్ పి.శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తమ బ్యాంకు శాఖల్లో పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల పంపిణీ జరుగుతోందన్నారు. ఎలాంటి మార్ట్గేజ్ లేకుండా పంటలను బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా రూ.3 లక్షల వరకు పంట రుణం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ బ్యాంకుల విలీనంతో ఇపుడు ఏపీజీబీ శక్తివంతంగా మారిందన్నారు. ప్రజల అవసరాల నిమిత్తం మరింత మెరుగైన సేవలు అందిస్తామన్నారు. డిపాజిట్లపై 7.6 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.1 శాతం వడ్డీ రేటు వర్తింపజేశామన్నారు.
రైతు నగదు దోచుకెళ్లిన
దుండగులు
కళ్యాణదుర్గం రూరల్: రైతు నగదు దుండగులు దోచుకెళ్లిన ఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. వివరాలు.. బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన రైతు తిమ్మప్ప గురువారం కళ్యాణదుర్గం పట్టణంలోని ఆంధ్రా బ్యాంక్లో రూ.5,00,000 విత్డ్రా చేశాడు. అనంతరం అక్కడి నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. పట్టణంలోని రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద బైక్ను ఆపి నగదు అందులోని బ్యాగులో ఉంచి మూత్ర విసర్జన చేసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చిన తిమ్మప్ప బైక్ బ్యాగ్ తీసి ఉండటం గుర్తించాడు. అందులోని నగదు కనపించలేదు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
యాడికి: జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న కురుకుంట గ్రామానికి చెందిన విజయభాస్కరరెడ్డి కనిపించడ లేదు. గత నెల 28న యాడికి మండలం కొట్టాలపల్లిలో జరిగిన వివాహ వేడుకలకు వచ్చిన ఆయన ఇప్పటి వరకూ ఇంటికి చేరుకోలేదు. ఆయన ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో గురువారం యాడికి పీఎస్లో తండ్రి గురివిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం పట్టివేత
బొమ్మనహాళ్: అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం బొమ్మనహాళ్ మండలంలోని సంగమేశ్వరస్వామి దేవాలయం వద్ద విజిలెన్సు అధికారులు పట్టుకున్నారు. బొమ్మనహాళ్ మండలంలోని పలు గ్రామాల్లో పేదల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసిన 37 క్వింటాళ్ల రేషన్ బియ్యన్ని కేఎ34డి2274 నంబరు గల బొలెరో వాహనంలో కర్ణాటకలోని చిత్రదుర్గ్ జిల్లా బి.జి.కెరె గ్రామానికి తరలిస్తున్నట్లుగా గుర్తించినట్లు విజిలెన్సు ఎస్ఐ గోపాలుడు తెలిపారు. ఘటనకు సంబంధించి డ్రైవర్ బసవరాజు, బియ్యం వ్యాపారులు జి. యల్లప్ప, రుద్రన్నపై రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్నాయక్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
నీట మునిగి యువకుడి మృతి
గార్లదిన్నె: ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన షేక్ బాబావలి (28) కల్లూరులో వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ అదే గ్రామంలోనే నివాసముంటున్నాడు. గురువారం వేసవి తాపాన్ని తాళలేక స్థానికంగా ఉన్న వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు వెళ్లిన బాబావలి ఉన్నఫలంగా నీట మునిగాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. గత ఈతగాళ్లను రంగంలో దించి బాబావలిని వెలికి తీశారు. అప్పటికే ఊపిరి ఆడక మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహమ్మద్గౌస్ బాషా తెలిపారు. కాగా, బాబావలికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

రూ.3 లక్షల వరకు ఏపీజీబీ పంట రుణాలు

రూ.3 లక్షల వరకు ఏపీజీబీ పంట రుణాలు

రూ.3 లక్షల వరకు ఏపీజీబీ పంట రుణాలు