
కుందుర్పి జెడ్పీటీసీకి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
కుందుర్పి: స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు రాధాస్వామి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన సహచరుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు.. గురువారం సాయంత్రం తన సహచరుడు కరిగానిపల్లికి చెందిన ఉప్పర రాజు(37)తో కలసి ద్విచక్ర వాహనంపై మలయనూరు నుంచి కుందుర్పికి వెళుతుండగా కేజీబీవీ వద్దకు చేరుకోగానే ఎదురుగా రాళ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై పడింది. ఘటనలో రాధాస్వామికి కుడికాలు విరిగింది. వాహనం నడుపుతున్న రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై క్షతగాత్రులను కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. చికిత్స అందేలోపు రాజు మృతిచెందాడు. రాజుకు భార్య కమలమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాధాస్వామిని అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై కుందుర్పి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ప్రమాదం విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఫోన్లో రాధాస్వామిని పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సహచరుడి మృతి

కుందుర్పి జెడ్పీటీసీకి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం