
సీఎం పర్యటనలో లోటుపాట్లకు తావివ్వొద్దు
● కలెక్టర్ వినోద్కుమార్
వజ్రకరూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ నెల 9న వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ జగదీష్తో కలిసి ఛాయాంపురంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం స్థానిక ప్రాథమిక పాఠశాలలో జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సీఎం సభకు 3,000 మంది హాజరయ్యేలా చూడాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలన్నారు. హెలీప్యాడ్ వద్ద భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలన్నారు. ‘బంగారు కుటుంబం’ లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగా, కలెక్టర్,ఎస్పీలతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, డీఆర్ఓ మలోల, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి,డీపీఓ నాగరాజునాయుడు, సీఎంఓ అధికారులు దినేష్, ఏఎస్పీ రమణ మూర్తి,ఆర్డీఓలు కేశవనాయుడు, శ్రీనివాసులు, వసంతబాబు తదితరులు పాల్గొన్నారు.