వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం కార్పొరేషన్: జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పిరికిపంద చర్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అమాయకుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఈ దాడి యావత్ దేశాన్ని కలచి వేసిందని, బాధ్యులు తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకుంటారన్నారు.
ఇటువంటి సమయంలో అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుద్దామన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగ కుండా కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.
డిటోనేటర్ పేలి మహిళకు తీవ్ర గాయాలు
పెద్దవడుగూరు: మండలంలోని అప్పేచెర్ల గ్రామంలో డిటోనేటర్ పేలి వ్యవసాయ మహిళా కూలీ సుంకమ్మ తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన మేరకు.. అప్పేచెర్లకు చెందిన రైతు చౌడప్ప పొలంలోని పత్తి కట్టెను తొలగించేందుకు బుధవారం మహిళా కూలీలు వెళ్లారు. అప్పటికే అడవి పందుల కోసమని గుర్తు తెలియని వ్యక్తులు కాయలాంటి పదార్థంలో డిటోనేటర్లు పెట్టి ఉంచారు.
ఈ విషయం తెలియని మహిళా కూలీ సుంకమ్మ ఆసక్తిగా దానిని తీసుకుని పరిశీలించి, కాయను పగులగొట్టి తినే ప్రయత్నంలో భాగంగా రాయిపై పెట్టి మరో రాతితో బలంగా కొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఆమె ఎడమ చెయ్యి పూర్తిగా ఛిద్రమైంది. క్షతగాత్రురాలిని వెంటనే గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఉగ్రదాడి పిరికిపంద చర్య