అనంతపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం అందించే రాయితీ (సబ్సిడీ) రుణాలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. యూనిట్ విలువలో సగం మాకు ఇస్తే కచ్చితంగా రుణం వచ్చేలా చూస్తామని కూటమి పార్టీల నాయకులు బహిరంగంగా దందాకు తెరలేపారు. ఆ మేరకు తాము సిఫార్సు చేసిన వారిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. చేసేది లేక అధికారులు వారు చెప్పినట్టే వింటున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది. అనంతపురం జిల్లాలో 2,369 స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు కోసం 22,945 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 1,472 యూనిట్ల కోసం 14,031 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో జనరిక్ మెడికల్ స్టోర్ల యూనిట్లకు 51 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 67 మంది దరఖాస్తు చేసుకున్నారు. చాలాచోట్ల ఇతర పార్టీలకు చెందిన వారు, సామాన్యులు దరఖాస్తు చేసుకున్నారన్న నెపంతో కనీసం ఇంటర్వ్యూలకు కూడా సమాచారం అందించలేదు.
సిఫార్సు ఉన్న వారికే రుణాలు
ఇంటర్వూలకు అందని సమాచారం