కళ్యాణదుర్గం: ఈజీ మనీ కోసం అత్యాశ పడిన ఓ టీడీపీ నేత పెద్ద మొత్తంలో నగదును మాయగాళ్ల చేతికిచ్చి మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వివరాలు... వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నివాసముంటున్న ఓ టీడీపీ నేత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పెట్టుబడులకు డబ్బు అవసరం కావడంతో ఈజీ మనీ కోసం ఆరా తీస్తూ వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు ఆయనను సంప్రదించారు. రూ.500 ఇస్తే రూ.వెయ్యి చెల్లిస్తామంటూ నమ్మబలికారు. వారి మాయలో చిక్కుకున్న సదరు టీడీపీ నేత తొలుత రూ.25వేలు ఇవ్వడంతో రూ.50 వేలు ఇచ్చారు. మరికొన్ని రోజులకు రూ.50వేలు ఇవ్వడంతో రూ.లక్షను వారు చెల్లించారు. ఇలా కొద్దికొద్దిగా ఇస్తే ఎప్పటికీ కష్టాలు తీరవని పెద్ద మొత్తంలో ఏమైనా ఇస్తే మంచి ఫలితం ఉంటుందని అవతలి వ్యక్తులు నమ్మబలకడంతో ఈసారి ఏకంగా సదరు టీడీపీ నేతకు రూ.15 లక్షలు సిద్ధం చేశాడు. కొన్ని రోజుల క్రితం కళ్యాణదుర్గానికి వచ్చిన కర్ణాటక వ్యక్తులు పట్టణ సమీపంలోని ఓ వ్యవసాయ పొలంలో టీడీపీ నేతతో సమావేశమయ్యారు. అనంతరం రూ.15 లక్షలు తీసుకుని రూ.30 లక్షలు ఉన్నాయంటూ ఓ పార్శిల్ను అప్పగించారు. ఇంటికెళ్లి పార్శిల్ ఓపెన్ చేయగానే అందులో నోట్ల కట్టల పరిమాణంలోనే బ్లాక్ అండ్ వైట్ పేపర్లను చూసి టీడీపీ నేత కంగారు పడ్డాడు. ఇదేమిటని కర్ణాటక వ్యక్తులను ఫోన్లో ప్రశ్నిస్తే ‘నీవు ఇచ్చినవన్నీ నకిలీ నోట్లు, నీ పై కర్ణాటకలో పోలీసు కేసు పెడతాం’ అని బెదిరించినట్లు సమాచారం. దీంతో జరిగిన ఘటనను బయటకు చెప్పుకోలేక సదరు టీడీపీ నేత లోలోన మదన పడుతున్నట్లు తెలిసింది. ఇదే అంశంపై కళ్యాణదుర్గం సీఐ యువరాజు మాట్లాడుతూ.. నకిలీ నోట్ల మార్పిడి వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై బాధితులతో విచారించినట్లుగా తెలిపారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ అందలేదన్నారు. అయినా కర్ణాటక ప్రాంత వ్యక్తుల మోసంపై ఆరా తీస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఈజీ మనీ కోసం మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న వైనం