ఉరవకొండ: స్థానిక మేజర్ పంచాయతీ ఆదాయ వనరులపై సుంకం వసూలు చేసేందుకు నిర్వహించిన టెండర్ల పరిశీలన ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... ఉరవకొండ బస్టాండ్, దినసరి మార్కెట్, కబేళా, మటన్ మార్కెట్, జీవాల సంత, పాయిఖానా తదితరాలపై సుంకం వసూలు చేసే హక్కుకు సోమవారం సీల్డ్ టెండర్లను అధికారులు ఆహ్వానించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈఓఆర్డీ సతీష్ సమక్షంలో సీల్డ్ కవర్లను పంచాయతీ కార్యదర్శి గౌస్సాహెబ్ స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత టెండర్లను తెరిచి ఎక్కువ కోట్ చేసిన వారికి హక్కులు కేటాయించాల్సి ఉంది. అయితే 3 గంటల తర్వాత చాలా మంది డిపాజిట్ చెల్లించి రశీదులు తీసుకోని సీల్డ్ టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చారు. దీంతో అధికారులు టెండర్ల పరిశీలనను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిబంధనల మేరకు మధ్యాహ్నం 2 గంటల వరకు వేసిన టెండర్లను కాదని 3 గంటల తర్వాత టెండర్లను ఎలా స్వీకరిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. నిర్దేశించిన సమయంలో లోపు ఎన్ని టెండర్లు పడ్డాయో వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశీలించి, హక్కులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో సీఐ మహనంది, ఎస్ఐ జనార్థన్నాయుడు, సిబ్బంది అక్కడకు చేరుకుని టెండరుదారులను సముదాయించి ఈ నెల 26న తిరిగి టెండర్లలో పాల్గొనాలని సూచించారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
విడపనకల్లు: విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన హరిజన సుంకన్న (22) సోమవారం ఉదయం తాగునీటి కుళాయికి విద్యుత్ మోటార్ను అమర్చుతుండగా విద్యుత్ ప్రసారం జరిగి షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుంకన్న మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, ఆయనకు ఏడాది క్రితమే వివాహమైంది. కవల పిల్లలు (మగ) ఉన్నారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వినతులను సకాలంలో
పరిష్కరించాలి : ఎస్పీ
అనంతపురం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. ఎస్పీ పి.జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు సకాలంలో పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్హెచ్ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ డీవీ రమణమూర్తి, మహిళా విభాగం డీఎస్పీ ఎస్.మహబూబ్ బాషా పాల్గొన్నారు.
తాడిపత్రిలో
మారణాయుధాలతో దాడులు
తాడిపత్రిటౌన్: స్థానిక చేపల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న చంద్ర, కన్నా వర్గీయులు సోమవారం మారణాయుధాలతో పరస్పర దాడులకు తెగబడ్డారు. కొంత కాలంగా చంద్ర, కన్నా మధ్య ఆస్తి వివాదం నెలకొంది. దీంతో రెండు గ్రూపులుగా విడిపోయి కొంత కాలంగా తరచూ గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం వేటకొడవళ్లు, కత్తులు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుంటుండగా గొడవ పడుతున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.
టెండర్ల వాయిదాతో ఉద్రిక్తత
టెండర్ల వాయిదాతో ఉద్రిక్తత