దేశంలో మతోన్మాద పాలన | - | Sakshi
Sakshi News home page

దేశంలో మతోన్మాద పాలన

Mar 24 2025 5:55 AM | Updated on Mar 24 2025 5:54 AM

అనంతపురం అర్బన్‌: ‘కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం మతోన్మాద పాలన సాగిస్తోంది. దేశ సంపదను అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోంది’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ పాలన వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలోని కేఎస్‌ఆర్‌ కళాశాల ఎదుట బహిరంగ సభ నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్‌ అధ్యక్షతన జరిగిన సభకు రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ... దేశ స్వాతంత్రం కోసం పోరాడని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేడు అధికారం చేపట్టి మతోన్మాద పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీని కించపరిచేలా... ఆయనను చంపిన గాడ్సేని గొప్పవాడిగా బీజేపీ చూస్తోందన్నారు. నాడు కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు మాత్రమే దేశం కోసం పోరాటాలు సాగించారన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లోనే అవమానపరిచిన చరిత్ర బీజేపీదన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చు రగలిస్తున్నారన్నారు. బీజేపీ వల్ల దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. డీలిమిటేషన్‌ ద్వారా ఉత్తరాదిన సీట్లు పెంచుకుని తమ పార్టీ బలం పెంచుకునేందుకు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభాప్రాతిపదికన సీట్లు తగ్గించే కుటిలత్వాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మతోన్మాద పాలన, దేశ ఆర్థికాన్ని కొల్లగొట్టే చర్యలకు వ్యతరేకంగా ఏప్రిల్‌ 14వ తేదీ వరకూ ప్రజా చైతన్య కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు. సభలో జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి, కేశవరెడ్డి, శ్రీరాములు, పద్మావతి, సీపీఐ, ఏఐవైఎఫ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement