గార్లదిన్నె: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన మంజునాథ్రెడ్డి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో సాప్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నారు. నిరుద్యోగిగా ఉన్న సమయంలో శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లికి చెందిన నరసింహులు అనే యువకుడితో పరియమైంది. ఆ సమయంలో నరసింహులు తాను తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కన్సెల్టెన్సీ ఏజెన్సీలు నడుపుతున్నానని, బీటెక్ పూర్తి చేసిన వారికి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లుగా నమ్మబలికాడు. రూ.6 లక్షలు చెల్లిస్తే మంచి ఫ్యాకేజీతో ఉన్నత శ్రేణి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో మంజునాథరెడ్డి మిన్నకుండి పోయాడు. అయితే పదేపదే నరసింహులు కలసి హంగామా చేస్తుండడంతో అతని మాయలో మంజునాథరెడ్డి చిక్కుకున్నాడు. ఉద్యోగం వస్తుందన్న ఆశతో తన బంధువుల వద్ద రూ. 6 లక్షలు అప్పు చేసి 2024, జూన్లో విడతల వారీగా నరసింహులు ఫోన్ పే, బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. మంజునాథ్రెడ్డి ప్రయత్నాలను గమనించిన అనంతపురానికి చెందిన ఆయన స్నేహితుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందన్న ఆశతో నరసింహులకు రూ.6లక్షలు చెల్లించారు. నగదు బదలాయింపులు జరిగిన తర్వాత ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో పలుమార్లు నరసింహులును అభ్యర్థిస్తూ వచ్చినా ఫలితం లేకపోయింది. ఉద్యోగం ఇప్పించలేక పోతే తమ డబ్బు వెనక్కు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో నరసింహులు ముఖం చాటేశాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మంజునాథరెడ్డికి అనుమానం వచ్చి కొన్ని రోజుల క్రితం చెన్నేకొత్తపల్లికి వెళ్లి నరసింహులు కోసం ఆరా తీశాడు. అక్కడ ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని ఫిర్యాదు చేయడంతో గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేసి, నరసింహులు కోసం గాలింపు చేపట్టారు.
పాము పట్టబోతే కాటేసింది!
తాడిపత్రి టౌన్: పామును పడుతూ ఓ యువకుడు కాటుకు గురయ్యాడు. వివరాలు.. తాడిపత్రిలోని స్పాట్లైన్ స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా ఓ పామును గుర్తించి, అకాడమీ నిర్వాహకుడు నరేష్కు తెలిపారు. ఆయన ద్వారా సమాచారం అందుకున్న శ్రీనివాసపురానికి చెందిన పాములు పట్టే నిపుణుడు సూర్యనారాయణ అక్కడకు చేరుకుని పరిశీలించాడు. అప్పటికే బల్ల కిందకు చేరుకున్న పామును గుర్తించి పట్టుకోబోతుండగా అది కాటేసింది. అదే సమయంలో పామును ఒడిసిపట్టి సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు. అనంతరం సూర్యనారాయణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి అకాడమీ నిర్వాహకులు తీసుకెళ్లారు.
వ్యక్తి దుర్మరణం
తాడిపత్రి: మండలంలోని వెంకటరెడ్డిపల్లి బస్టాప్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామానికి మురుగేష్ (56) వ్యక్తిగత పనిపై ఆదివారం తాడిపత్రికి వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం టీవీసీ మోపెడ్పై తిరుగు ప్రయాణమైన ఆయన వెంకటరెడ్డిపల్లి బస్టాఫ్ వద్దకు చేరుకోగానే బుగ్గ వైపు నుంచి బండల లోడ్తో వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. ఘటనలో తల ఛిద్రమై మురుగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడిపత్రి రూరల్ అప్గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.