కూడేరు: మత్స్య సంపద పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి శనివారం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద 2024–25 సంవత్సరానికి గాను ఐదు లక్షల చేప పిల్లలను కలెక్టర్ వదిలారు. మత్స్యకారులను ఆర్ధికంగా బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మత్స్యకారులు మాట్లాడుతూ డ్యాంలో నీరు పుష్కలంగా ఉందని, అదనంగా మరో 10 లక్షల చేప పిల్లలు సరఫరా చేయాలని, కొర్రకోడులో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పే నాయక్, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఫిషరీస్ డీడీ శ్రీనివాసనాయక్, ఎఫ్ట్టీఎఫ్లు ఆసిఫ్, బాబునాయక్, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి పాల్గొన్నారు.
గ్యాస్ లీకై వృద్ధురాలి మృతి
అనంతపురం: వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని రెవెన్యూ కాలనీ (షిర్డీ కాలనీ)లో నివాసం ఉంటున్న విశ్రాంత ఏఎన్ఎం మంగళ లక్ష్మీదేవి (75), ఎం.రంగన్న దంపతులు. 2004లో భర్త చనిపోయాడు. సంతానం లేకపోవడంతో లక్ష్మీదేవి ఒంటరిగా ఉంటోంది. శనివారం ఇంట్లో వంట చేస్తుండగా.. గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఆ మంటల నుంచి బయటకు రాలేక లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడి మృతి చెందింది. సోదరుడు కనుముక్కల ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ శాంతిలాల్ తెలిపారు.