అనంతపురం: నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా బీటెక్ కోర్సు సిలబస్ రూపకల్పన చేసినట్లు జేఎన్టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు అన్నారు. బీటెక్ మూడు, నాలుగు సంవత్సరాలకు సంబంధించిన పాఠ్యాంశాలను రూపకల్పన చేయడానికి శనివారం యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు వీసీ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగంలోనూ మైనర్, హానర్ డిగ్రీ ప్రోగ్రాంను ప్రతిపాదించారు. విద్యార్థి 18 క్రెడిట్లు అదనంగా చదివితే ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు మైనర్, హానర్స్ డిగ్రీ ఇస్తారు. క్వాంటం కంప్యూటింగ్లో మైనర్ డిగ్రీ చేయడానికి అనుమతి ఉంటుంది. 40 శాతం క్రెడిట్స్ ఆన్లైన్లో చదువుకోవచ్చు. దీనితో పాటు కచ్చితంగా ఐదు రోజుల వర్క్షాపు, ప్రతి సెమిస్టర్లోనూ ఎక్స్పర్ట్ లెక్చర్, క్రెడిట్ డిపాజిట్ కోసం ఆమోదం తెలిపారు. ప్రతి విద్యార్థి ఫైనలియర్ రెండో సెమిస్టర్లో ఇంటర్న్షిప్, మూడో సెమిస్టర్ సమ్మర్ బ్రేక్లో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ సిలబస్ను 2025–26 విద్యా సంవత్సరానికి మూడో సంవత్సరం చదువబోయే విద్యార్థులకు అమలు చేస్తారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎస్.కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ దేవన్న, ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.