ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం

Mar 23 2025 8:51 AM | Updated on Mar 23 2025 8:50 AM

అనంతపురం అగ్రికల్చర్‌: వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రకృతి సిద్ధంగా సహజ వ్యవసాయ పద్ధతులు అవలంబించేలా రైతులను ప్రోత్సహిస్తే వ్యవసాయం లాభసాటిగా మారడమే కాకుండా ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుందని వక్తలు తెలిపారు. శనివారం స్థానిక పోలీసు కాంప్లెక్స్‌లో ప్రభుత్వ సంస్థలు, ఎన్‌జీఓలతో ఏర్పాటైన ‘అనంత సుస్థిర వ్యవసాయ వేదిక’ ఆధ్వర్యంలో మూడు రోజుల ‘మిల్లెట్‌ మేళా’ ప్రారంభమైంది. విశ్రాంత ఐఏఎస్‌, జిల్లా మాజీ కలెక్టర్‌ బి.జనార్ధన్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్‌, ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి, విశ్రాంత ఐపీఎస్‌, జమ్మూకశ్మీర్‌ మాజీ డీజీపీ గోపాల్‌రెడ్డి, ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ మల్లారెడ్డి, ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్‌ పాలేకర్‌ శిష్యులు విజయరామ్‌ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. వాతావరణంలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని స్థానిక వంగడాలను ప్రోత్సహించాలన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటేనే సన్న, చిన్నకారు రైతులు ఆర్థికంగా గట్టెక్కుతారని తెలిపారు. ‘మన వ్యవసాయం, మన పంటలు, మన వంటలు, మన ఆరోగ్యం’ అనే నాలుగు అంశాలు ఒకదానితో మరొకటి ముడిపడిన వాస్తవాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాతతరం పంటలైన సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు లాంటి చిరుధాన్యాలను, అనుములు, కందులు, అలసంద, పెసలు, నూగులు లాంటి పప్పుధాన్యపు పంటలు పెద్ద ఎత్తున సాగులోకి వచ్చేలా రైతులకు చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ జిల్లాల్లో 80 శాతం వ్యవసాయం వర్షాలపై ఆధారపడి ఉన్నందున ఈ పంటల సాగుకు అనువుగా ఉంటుందన్నారు. ఈ పంటల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని, పశువులు, జీవాలకు మేతగానూ ఉపయోగపడతాయన్నారు. నేల ఆరోగ్యంతో పాటు జీవ వైవిధ్యం, గ్రామీణ జీవనోపాధులు మెరుగుపడతాయన్నారు. కాగా, మిల్లెట్‌ మేళా సందర్భంగా పోలీసు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌, చిరుధాన్యాలతో వేసిన స్వాగతం పలికే ముగ్గు ఆకట్టుకుంది. మేళాలో తొలిరోజు ప్రధానంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, వాటి లాభాల గురించి విజయరామ్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వినూత్న, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఉద్యానశాఖ డీడీ నరసింహారావు, ఏపీడీ ఫిరోజ్‌ఖాన్‌, నాబార్డు అధికారి మోహనయ్య, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్‌ మాధవీలత, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చిరుధాన్యాలు సాగు చేసేలా ప్రోత్సహించాలి

తద్వారా ప్రజారోగ్యం మెరుగుపడుతుంది

‘మిల్లెట్‌ మేళా’లో వక్తలు

ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం 1
1/1

ప్రకృతి వ్యవసాయమే లాభదాయకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement