కూడేరు: వ్యవసాయ పొలాల్లో ఫారంపాండ్లు తవ్వించుకుంటే వర్షపు నీరు అందులోకి చేరి భూగర్భ జలాలు పెంపొందుతాయని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రపంచ జల దినోత్సవం’లో భాగంగా శనివారం కూడేరు మండలం జయపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద తవ్వనున్న ఫారంపాండ్ల పనులను ఆయన ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఫారంపాండ్ను తవ్వించుకోవాలని సూచించారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సాగుతూ విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మండలానికి ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీం బాషా, సర్పంచ్ రమావేవి, తహసీల్దార్ మహబూబ్ బాషా, ఎంపీడీఓ కుళ్లాయి స్వామి, రైతులు పాల్గొన్నారు.
న్యూస్రీల్