రెండు నెలల క్రితం.. | - | Sakshi
Sakshi News home page

రెండు నెలల క్రితం..

Mar 23 2025 8:51 AM | Updated on Mar 23 2025 8:50 AM

రాయదుర్గం: పదో తరగతి కూడా పూర్తి చేసి ఉండరు. కొన్ని రోజులు ఏదో ఒక ఆస్పత్రిలో డాక్టరు దగ్గర ఇంజెక్షన్లు, మందులు అందజేసే సహాయకుడిగా పని చేసి ఉంటారు. బయటకొచ్చాక తామేదో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ చదివినట్లు భావించి క్లినిక్‌లు ప్రారంభించేస్తున్నారు. బెడ్లు ఏర్పాట్లు చేసుకుని సైలెన్లు ఎక్కించేస్తున్నారు. యూట్యూబ్‌లలో వీడియోలు చూసి చికిత్సలు చేస్తూ ప్రాణాలు కూడా బలికోరుతున్నారు. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకున్న కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. స్టెరాయిడ్లు, గర్భస్రావ, నిద్ర మాత్రలు కూడా రాస్తున్న ఈ ‘శంకర్‌దాదాలు’ అమాయకుల ఉసురు తీసేస్తున్నారు. గత 3 నెలల వ్యవధిలోనే జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గమైన రాయదుర్గం ప్రాంతంలో మూడు ప్రాణాలు బలిగొన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే కాదు.. ప్రతి నెలా జిల్లాలో ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయినా, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. ఘటన జరిగినప్పుడు హడావుడి చేసి .. తర్వాత ‘మామూలు’గా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గతి లేక ఆశ్రయిస్తే..

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సర్కారు వైద్య సేవలు ఘోరంగా తయారయ్యాయి. మెరుగైన వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, ప్రాథమిక వైద్య శాలల్లో సేవలు సరిగా అందడం లేదు. రాయదుర్గంలో పేరుకే వంద పడకల ఆస్పత్రి అయినా సగానికి పైగా వైద్యుల సీట్లు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే నిలదీస్తున్నా సర్కారులో చలనం లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా వైద్య రంగానికి పెద్దపీట వేయగా, ‘కూటమి’ కొలువుదీరాక పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. దీంతో దిక్కులేని పరిస్థితుల్లో పేదలు ఆర్‌ఎంపీల క్లినిక్‌లను ఆశ్రయిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ఈ నెల 21న

ఈ నెల 2న

తలనొప్పితో బాధపడుతున్న బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన వివాహిత జ్యోతిబాయి... గుమ్మఘట్ట మండలం భూపముద్రం గ్రామానికి వచ్చి ఆర్‌ఎంపీతో ఇంజెక్షన్‌ వేయించుకుంది. కాసేపటికే తలనొప్పి మరింత తీవ్రం కావడంతో కుటుంబీకులు ఆమెను కళ్యాణదుర్గంలోని ఆర్డీటీ ఆస్పత్రి, అక్కడి నుంచి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించడం వల్లే జ్యోతిబాయి మృతి చెందిందని కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు.

రాయదుర్గం పట్టణానికి చెందిన టీడీపీ కౌన్సిలర్‌ భర్త, పీఎంపీ చన్నవీర క్లినిక్‌లో వైద్య చికిత్సలు అందుకున్న తాపీమేసీ్త్ర విజయ్‌ ప్రాణాలు వదిలాడు. తన కుమారుడి మృతికి పీఎంపీ వైద్యమే కారణమని విజయ్‌ తల్లి లక్ష్మీదేవి ఆరోపించింది. చన్నవీర టీడీపీ నాయకుడు కావడంతో కేసు నమోదుకు అధికారులు, పోలీసులు వెనుకంజ వేశారు. బాధిత కుటుంబీకులతో దుప్పటి పంచాయితీ నిర్వహించి, యువకుడి ప్రాణానికి రూ.3 లక్షలు వెలకట్టారు.

గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన వన్నూర్‌స్వామి, లక్ష్మీ దంప తుల కుమార్తె అనుశ్రీకి తీవ్ర జ్వరం సోకింది. రాయదుర్గం పట్టణంలోని మూస క్లినిక్‌లో ఆర్‌ఎంపీ హఫీజ్‌తో వైద్యం చేయించారు. చిన్నారికి టైఫాయిడ్‌ ఉన్నట్టు నిర్ధారించిన హఫీజ్‌.. క్లినిక్‌లో ఆమెకు సైలెన్‌ ఎక్కించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతి చెందింది. ఆర్‌ఎంపీ వైద్యం వికటించడం వల్లే బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతాం. క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం. రాయదుర్గంలో వరుస మరణాలపై విచారణకు ఆదేశించాం. బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. – ఈబీ దేవి, డీఎంహెచ్‌ఓ

రెండు నెలల క్రితం.. 1
1/1

రెండు నెలల క్రితం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement