అనంతపురం అర్బన్: వేసవిలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్కుమార్ సూచించారు. ముఖ్యంగా వడదెబ్బకు గురైతే తలనొప్పి, తల తిరగడం, తీవ్ర జ్వరం, మత్తునిద్ర, కలవరింతలు, ఫిట్స్, పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. వడదెబ్బకు గురికాకుండా జిల్లా వైద్యారోగ్య శాఖ సూచనలు పాటించాలన్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు.
వడదెబ్బకు గురవుతే...
● వడదెబ్బకు గురైన వారిని నీడగా ఉన్న చల్లటి ప్రదేశానికి చేర్చాలి. తడివస్త్రంతో శరీరం తుడవాలి. ఫ్యాన్ కింద ఉంచాలి.
● శరీర ఉష్ణోగ్రత 101 డ్రిగీల కంటే తక్కువకు వచ్చే వరకూ ఐస్ వాటర్ వస్త్రంతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి.
● సాధారణ స్థితికి రాకపోతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి. వైద్య చికిత్స అందించాలి.
తీవ్రమైన ఎండలో చేయకూడనివి...
● సూర్య కిరణాలకు, వేడి గాలికి గురికాకూడదు. గొడుగు లేకుండా తిరగరాదు.
● మధ్యాహ్నం తరువాత (ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని చేయకూడదు.
● ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు.
● శీతల పానీయాలు, ఐసు ముక్కలు తీసుకోవడం ద్వారా గొంతు సంబంధిత అనారోగ్యం ఏర్పడుతుంది.
తీవ్ర ఎండలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తెలుపు రంగులోని పలుచటి కాటన్ వస్తాలను ధరించాలి. తలకు టోపీ లేదా రుమాలు కట్టుకోవాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలి. ఓరల్ రీ హైడ్రేషన్ నీటినీ తాగొచ్చు.
ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు గ్లాసు నీరు తప్పనిసరిగా తాగాలి. అలాగే వీలైనని సార్లు నీరు తాగుతూ ఉండాలి.
ఎండలోంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం కానీ కొబ్బరినీరు లేదా చల్లని (మట్టికుండాలోని) నీరు తాగాలి.
ఎండలో బయటకు వెళ్లినప్పుడు తలతిరగడం, తదితర అనారోగ్య సమస్యలు ఏర్పడితే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించి ప్రాథమిక చికిత్స పొంది వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవచ్చు.
కలెక్టర్ వినోద్కుమార్ సూచన