అనంతపురం టవర్క్లాక్: వెనకబడిన ప్రాంతాల అబివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 23న నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షుడు కేవీ రమణ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడిగా ఉన్న హంద్రీ–నీవా, హెచ్చెల్సీ ప్రాజెక్టులపై చర్చించి, చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రకటించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరుతూ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించే ఔత్సాహికులు, మేధావులు ఈ నెల 23న ఆదివారం ఉదయం 10 గంటలకు బీజీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే రౌండ్టేబుల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. సమావేశంలో శ్రీనివాసులు, గంటల నారాయణ రెడ్డి, కుళ్లాయప్ప, వెంకటేశులు, ఫృథ్వీ, నరేంద్ర పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానం కార్మికుల హక్కు
● ఎంప్లాయీస్ సంఘ్ డిమాండ్
గుంతకల్లు: కార్మికుల హక్కుగా ఉన్న పాత పెన్షన్ విధానాన్ని సాధించుకుని తీరుతామంటూ దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ అన్నారు. డిమాండ్ సాధనలో భాగంగా శుక్రవారం స్థానిక డీఆర్ఎం కార్యాలయం ఎదుట ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఇప్పటికే పలు మార్లు ఆందోళనలు చేసినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చే వరకూ ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు మల్లికార్జున, బాలకృష్ణ, ప్రకాష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల అధికారుల నియామకం
● ఉత్తర్వులు జారీ చేసిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో ఐదు ఎంపీపీ, నాలుగు వైస్ ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులను నియమించారు. ఈ మేరకు ఉభయ జిల్లాల ఎన్నికల అధికారులు డాక్టర్ వి.వినోద్కుమార్, టీఎస్ చేతన్ ఉత్తర్వులు జారీ చేశారు. కణేకల్లు మండలానికి జిల్లా రిజిస్ట్రార్ జి.భార్గవ్, కంబదూరు మండలానికి ఆత్మ పీడీ మద్దిలేటి, ఉరవకొండకు బీసీ వెల్ఫేర్ అధికారి ఖుష్బూ కొఠారి, యల్లనూరుకు జిల్లా ఉద్యానాధికారి పి.రఘునాథరెడ్డి, పెద్దపప్పూరుకు డెయిరీ శాఖ డీడీ ఎం.ప్రభాకరరెడ్డి, రాయదుర్గానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్ను ఎన్నికల అధికారులుగా నియమించారు.
బ్యాంకుల బంద్ వాయిదా
అనంతపురం అగ్రికల్చర్: ఈ నెల 24, 25న తలపెట్టిన బ్యాంకుల బంద్ వాయిదా పడింది. ఈ మేరకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ నాయకులు శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. జాతీయ కమిటీ, కేంద్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి సానుకూల స్పందన వ్యక్తమైన నేపథ్యంలో సమ్మెను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు జాతీయ కమిటీ నుంచి సమాచారం అందిందన్నారు.
వ్యభిచారం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
హిందూపురం అర్బన్: అడ్డదారులు తొక్కి సులువుగా డబ్బు సంపాదించాలన్న ఓ కానిస్టేబుల్ ఏకంగా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన హిందూపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కానిస్టేబుల్ పురుషోత్తం హిందూపురం రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఇటీవలే మడకశిర స్టేషన్కు బదిలీ అయ్యాడు. హిందూపురంలోని మోడల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. పట్టణంలోని బోయ పేటకు చెందిన ఓ మహిళతో కలిసి ఆ ఇంట్లో వ్యభిచార కేంద్రాన్ని ప్రారంభించాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేవారు. కానిస్టేబుల్ వ్యవహారశైలిని గమనించిన చుట్టుపక్కల ఇళ్ల వారు పలుమార్లు హెచ్చరించారు. అయినా పద్ధతి మార్చుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం, సిబ్బంది ఈ నెల 18న రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి కానిస్టేబుల్తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగు చూడటంతో శుక్రవారం ఇద్దరిపై కేసు నమోదు చేసి..రిమాండుకు తరలించారు. ఇదే కేసులో మేళాపురానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కాగా.. కానిస్టేబుల్ పురుషోత్తం గుడిబండ స్టేషన్లో పనిచేసిన సమయంలోనూ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యాడు.
మరో ఇద్దరు అరెస్టు
● హిందూపురం పట్టణంలోని సీపీఐ కాలనీలో ఎస్.బాబా, అతని భార్య వ్యభిచారం నిర్వహిస్తుండగా శుక్రవారం ఉదయం దాడి చేసి వారితో పాటు మరొక మహిళను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
23న రౌండ్టేబుల్ సమావేశం
23న రౌండ్టేబుల్ సమావేశం