ఆత్మకూరు: రైతులకు నష్టం చేకూర్చే హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులు ఆపకపోతే పోరుబాట తప్పదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఆత్మకూరు మండలం పంపరూరు తండా వద్ద హంద్రీ–నీవా కాలువను బుధవారం ఆయన పరిశీలించారు. యంత్రాల సాయంతో సాగుతున్న పనులను గమనించి అక్కడి కాంట్రాక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పనులు ఆపాలని డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసే పనులతో పాటు పంట కాలువల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అలా కాదని రైతులకు నష్టం చేకూర్చేలా లైనింగ్ పనులు చేస్తామంటే కుదరదన్నారు. లైనింగ్ పనులు అడ్డుకునేందుకు ఎంతకై నా సిద్ధమని, అవసరమైతే యంత్రాలను పగులగొడతామని హెచ్చరించారు. రాయలసీమ జిల్లాల్లోని దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. వెంటనే లైనింగ్ టెండర్లను రద్దు చేసి, కాలువను పదివేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యానికి వెడల్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు చంద్రిక, రామాంజినమ్మ, శివశంకర్ పాల్గొన్నారు.
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి