22న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

22న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

Mar 20 2025 12:47 AM | Updated on Mar 20 2025 12:48 AM

అనంతపురం సిటీ: జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 22న నిర్వహించనున్నారు. అనంతపురంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని ప్రధాన, అదనపు సమావేశ భవనాల్లో సమావేశాలుంటాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/ఇంజినీరింగ్‌ విభాగాలు/గ్రామీణాభివృద్ధి/ విద్య, వైద్యం) సమావేశాలు జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. అదనపు సమావేశ భవన్‌లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్‌/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా చైర్‌పర్సన్‌ల అధ్యక్షతన డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య నేతృత్వంలో జరుగుతాయి.

స్కూళ్లలో లాంగ్వేజ్‌ ఫెస్టివల్స్‌, సైన్స్‌, మ్యాథ్స్‌ క్లబ్స్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో లాంగ్వేజ్‌ ఫెస్టివల్స్‌, సైన్స్‌, మ్యాథ్స్‌ క్లబ్స్‌ నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ టి.శైలజ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 364 సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠశాలల్లో లాంగ్వేజ్‌ ఫెస్టివల్స్‌, 198 సెకండరీ, 325 ఎలిమెంటరీ పాఠశాలల్లో సైన్స్‌ అండ్‌ మాథ్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. లాంగ్వేజ్‌ ఫెస్టివల్స్‌ కోసం ఒక్కో పాఠశాలకు రూ. 500 చొప్పున రూ.1.82 లక్షలు, సైన్స్‌, మాథ్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేయడానికి ఒక్కో పాఠశాలకు రూ. వెయ్యి చొప్పున రూ. 1.98 లక్షలు జమ చేశామన్నారు. సైన్స్‌, మ్యాథ్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేయడానికి ఒక్కో పాఠశాలకు రూ. వెయ్యి చొప్పున రూ. 3.25 లక్షలు మండల విద్యాధికారులకు విడుదల చేసినట్లు వెల్లడించారు. మండల విద్యాధికారులు ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని, ప్రధానోపాధ్యాయులు లాంగ్వేజ్‌ ఫెస్టివల్స్‌ నిర్వహించి, సైన్స్‌ అండ్‌ మాథ్స్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మహిళ పట్ల అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఆరు నెలల జైలు

అనంతపురం: మహిళను అవమానపరచడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కొండమ్మను అదే గ్రామానికి చెందిన ఓబుళరాజు 2019 మే 23న బహిరంగ ప్రదేశంలో అవమానించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్‌కు పంపారు. కేసులో సాక్షులను బుధవారం అనంతపురం మొబైల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ సుజిన్‌ కుమార్‌ విచారించారు. నేరం నిరూపణ కావడంతో ముద్దాయి ఓబుళ రాజుకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 4 వేల జరిమానా విధించారు. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వి. శ్రీనివాసులు, సీఐ ఎం. కరుణాకర్‌, కోర్టు కానిస్టేబుల్‌ రమణను ఎస్పీ పి. జగదీష్‌ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement