అనంతపురం అర్బన్: ‘క్షేత్రస్థాయిలో రెవెన్యూ శాఖ పనితీరు బాగుండాలి. సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీలు, ఇతర సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. ‘సాక్షి’లో ఈనెల 18న ‘‘ప్రజా ప్రదక్షిణ వేదిక’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి ఆర్డీఓలు, జిల్లా రిజిస్ట్రార్, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఎస్ఆర్ఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సేవా సర్వీసెస్కు సంబంధించి పెండింగ్ ఉన్న అంశాలను పూర్తి చేయాలన్నారు. మ్యుటేషన్ ఫర్ కరెక్షన్, ట్రాన్సాక్షన్లు, ఏపీ డాటెడ్ ల్యాండ్ దరఖాస్తులు, రీవోక్ సర్టిఫికెట్లు, ఈ–పాస్ బుక్ సర్వీసెస్, మొబైల్ నెంబర్, పట్టాదార్ ఆధార్ సీడింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలన్నారు. చుక్కల భూములకు సంబంధించి ఈనెల 29న కూడేరు మండలం, ఏప్రిల్ 5న బుక్కరాయసముద్రం, ఏప్రిల్ 12న రాప్తాడు తదితర మండలాల పరిధిలోని దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దారు కార్యాయాల్లో మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రహరీ, గేటు, నీటి సదుపాయం, మహిళలు, పురుషులకు మరుగుదొడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సమావేశంలో ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఎస్డీసీ తిప్పేనాయక్, సర్వేశాఖ ఏడీ రూప్లానాయక్, తదితరులు పాల్గొన్నారు.
‘పది’ కేంద్రాల్లో సమస్యలు తలెత్తకూడదు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో ఏ చిన్న సమస్య తలెత్తకూడదని కలెక్టర్ వినోద్కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం నగరంలోని శ్రీచైతన్య పాఠశాలలోని కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష నిర్వాహణకు 135 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 30 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, 07 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 1,403 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు, అనంతపురం అర్బన్ తహశీల్దార్ హరిబాబు ఉన్నారు.
కలెక్టర్ వినోద్ కుమార్