● నేడు ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి
బ్రహ్మ రథోత్సవం
● దేశంలోనే మూడవది,
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రథం
● లక్షలాది మంది భక్తులు
పాల్గొంటారని అంచనా
ఐరావత వాహనంపై వసంత వల్లభుడు
వసంత వల్లభుడిగా పేరు గాంచిన ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ఐరావతం (గజవాహనం)పై దర్శనమిచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఐరావతంపై కాటమరాయుడి కమనీయ రూపాన్ని చూసి తరించారు. అనంతరం శ్రీవారు తిరిగి ఆలయంలోకి వెళ్లి పూజలందుకున్నారు.
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మ రథోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 7.45 నుంచి 8.20 గంటల మధ్య అనూరాధా నక్షత్రంలో మేష లగ్న పుష్కరాంశంలో తేరును ప్రారంభించేందుకు ఆలయ అర్చక పండితులు శుభ ముహూర్తంగా నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్సవం ఇది. తేరుపై కాటమరాయుడి వైభవాన్ని కనులారా చూసేందుకు భక్తులు లక్షలాదిగా ఇప్పటికే కదిరికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంతో పాటు తిరు వీధుల్లోని భవనాలన్నీ భక్తులతో కిటకిటలాడి పోతున్నాయి. ఆలయ ప్రాంగణంలో కాలు మోపేందుకు కూడా చోటు లేదు.
బ్రహ్మదేవుడే రథసారథి..
బ్రహ్మోత్సవాల్లో నారసింహుడు తిరు వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడానికి దేవతలు తమ తమ వాహనాలను పంపుతారని భక్తుల నమ్మకం. శ్రీవారి రథోత్సవం నాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే రథాన్ని నడిపి స్వామి వారు విహరించడానికి సహకరిస్తారని, అందుకే బ్రహ్మ రథోత్సవం అంటారని ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు తెలిపారు.
దేశంలోనే మూడవ పెద్ద తేరు..
తమిళనాడు అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూర్ జిల్లాలోని తిరువార్ రథం తర్వాత దేశంలో అతి పెద్ద రథంగా కదిరి తేరు ప్రసిద్ధి చెందింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బ్రహ్మ రథం ఇదే. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంటుంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు. 125 ఏళ్ల క్రితం తయారు చేసిన రథం చక్రాలు ఒక అడుగు, ఒక అంగుళం వెడల్పుతో పాటు 8 అడుగుల డయామీటర్తో ఉన్నాయి. రథంపై సుమారు 256 శిల్ప కళా కృతులను టేకుతో అందంగా చెక్కారు.
అర్చకుల వేదమంత్రాలు.. లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల
అర్చకుల వేదమంత్రాలు.. లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల