గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీ నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని ఉత్సవాలను విజవంతం చేద్దామంటూ ఆర్డీఓ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ కె.వాణితో కలసి ఆలయ సమీపంలోని రామదూత నిలయంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. 30న గ్రామోత్సవం, 31న రథోత్సవం, ఏప్రిల్ 1న లంకాదహనం ఉత్సవాలు ఉంటాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయ పరిసరాల్లో మద్యం అమ్మకాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అనంతరం అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ సిబ్బందితో కలసి ఉగాది ఉత్సవాల పోస్టర్లను ఆర్డీఓ ఆవిష్కరించారు.
గూడ్స్ ఆటోలకు జరిమానా
బొమ్మనహాళ్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ కూలీలను తరలిస్తున్న గూడ్స్ వాహన డ్రైవర్లకు జరిమానాలు విధించిన్నట్లు ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. సోమవారం ప్యాసింజర్లను, వ్యవసాయ కూలీలను ఎక్కించుని ప్రయాణం చేస్తున్న 5 గూడ్స్ వాహనాలను సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అప్పగించామన్నారు. రికార్డుల పరిశీలన అనంతరం కేఏ34సి1536 వాహన యజమానికి రూ.16,860, కేఏ34బి2519 వాహన యజమానికి 13,860, కేఏ34సి5230 వాహనదారుడికి రూ.7,010, కేఏ34సి5464 వాహన యజమానికి రూ.23,940లు, కేఏ34డి1862 వాహనదారుడికి రూ.18,840 జరిమానా విధించారన్నారు.