రాయలసీమ ‘లిఫ్ట్‌’ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

రాయలసీమ ‘లిఫ్ట్‌’ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం

Mar 19 2025 1:46 AM | Updated on Mar 19 2025 1:46 AM

రాయలసీమ ‘లిఫ్ట్‌’ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం

రాయలసీమ ‘లిఫ్ట్‌’ను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం

అనంతపురం కార్పొరేషన్‌: రాయలసీమ ప్రజల నీటి అవసరాల కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని, ప్రభుత్వ తీరు మారకపోతే అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమిస్తామంటూ మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంపై ముందు నుంచి సీఎం చంద్రబాబుకు చిన్నచూపన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల వ్యవధిలోనే ప్రాజెక్ట్‌ను పూర్తిగా మరుగున వేశారన్నారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయకూడదంటూ పేర్కొన్న ఎక్స్‌పర్ట్‌ సర్ర్‌పైజర్‌ కమిటీ డీపీఆర్‌పై గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ఎదుట సరైన వాదనలు విన్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమన్నారు. పర్యావరణానికి ఏమాత్రం ఇబ్బంది కలగని ఈ ప్రాజెక్ట్‌ కేవలం తాగునీటి అవసరాల కోసమేనన్న వాదనను సమర్థవంతంగా ప్రభుత్వం వినిపించి ఉంటే ఆశించిన ఫలితం దక్కి ఉండేదన్నారు. కేవలం వైఎస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఫలితంగా రాబోవు రోజుల్లో రాయలసీమ ప్రాజెక్ట్‌లకు నీరు అందడం ప్రశ్నార్థకమవుతుందన్నారు. కృష్ణా నది పరివాహక పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీకి ట్రిబ్యునల్‌ కేటాయించిన 2 వేల టీఎంసీల నీటిని వాడుకున్న తర్వాతే మిగులు జలాలను ప్రాజెక్ట్‌కు వాడుతామని పేర్కొనడం వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌కు నీరు సమకూర్చడం గగనమవుతుందన్నారు. ఇప్పటికే శ్రీశైలం జలాశయంలో 854 అడుగులకు నీటి మట్టం చేరే వరకూ నీటిని వాడుకోరాదని, శ్రీశైలం డ్యాంను ఆంధ్ర, నాగార్జున సాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిబంధనలు ఉన్నాయని వివరించారు. అయితే శ్రీశైలం ఎడమగట్టు తెలంగాణ పరిధిలో ఉండడంతో విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో నిబంధనలు ఉల్లంఘించి 798 అడుగులకు నీటి మట్టం చేరుకోగానే నీటిని తెలంగాణ ప్రభుత్వం తోడేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీమ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించక తప్పదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, నరేష్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement