ధర్మవరం: మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనం అమలు చేయాలని ఏపీ మీటర్ రీడర్స్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్కుమార్, ఏఐటీయూసీ నాయకులు ఎర్రమశెట్టి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మీటర్ రీడర్లు ప్రతి నెలా వచ్చే కమీషన్ల ద్వారా పూట గడవడం దుర్భరంగా మారుతోందన్నారు. ఉద్యోగభద్రత కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించక పోగా రీచార్జ్ మీటర్లు ఏర్పాటు చేసి మీటర్ రీడర్ల భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. మీటర్ రీడర్ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 18న డీఈ కార్యాలయాన్ని, 20న ఎస్ఈ కార్యాలయాన్ని, 27న సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు దస్తగిరి, రాజు, జగదీష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.