బెళుగుప్ప: మండలంలోని బి.రామసాగరం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్పకు చెందిన బోయ చంద్రన్న కుమారుడు సతీష్కుమార్ (19) అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఇటీవల ఇంటికి వచ్చాడు. తనతో పాటు అదే కళాశాలలో చదువుకున్న స్నేహితుడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామానికి చెందిన పవన్కుమార్తో కలసి సోమవారం ఉరవకొండ మండలం వై.రాంపురంలో ఎర్రితాత రథోత్సవానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన వారు బి.రామసాగరం క్రాస్ వద్దకుచేరుకోగానే అదుపు తప్పి కిందపడ్డారు. చీకటిలో అటుగా వచ్చిన కొందరు గుర్తించి కుటుంబసభ్యులకు విషయం తెలిసి, 108 అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గంలోని సీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యు లు అప్పటికే సతీష్కుమార్ మృతిచెందినట్లు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్కు చికిత్సలు అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవు
అనంతపురం: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలని, అయితే పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థుల అవసరాన్ని అవకాశంగా తీసుకుని పరిమితికి మించి ఆటోల్లో తరలించరాదన్నారు. ఆటో నడిపే ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ప్రమాద బీమా కలిగి ఉండాలన్నారు. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆటోలు ఆపి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించరాదన్నారు. ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు, దించేటప్పుడు రోడ్డుకు పూర్తిగా పక్కకు వెళ్లి ఆపాలన్నారు.