అనంతపురం అర్బన్: ‘వేసవి తీవ్రత అధికంగా ఉంటుంది. ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టండి. గిరిజన గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధర్తీ అబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏ–జేజీయూఏ)’ పకడ్బందీగా అమలు చేయాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట పైప్లైన్ల మరమ్మతు చేయాలని చెప్పారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్టాండ్లు, ఆస్పత్రులు, రైతు బజార్లు, దేవాలయాలు, మీ సేవ, ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
గిరిజన గ్రామాలను బాగుచేయాలి..
‘ధర్తీ అబా జన్జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్’ కింద గిరిజనుల గ్రామాలను బాగు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పథకం కింద జిల్లాలో గుండాల తండా, వెంకటంపల్లి చిన్న తండా, వెంకటంపల్లి పెద్దతండా, చిన్నవరం, నాగులగుడ్డం, నాగులగుడ్డం తండా గ్రామాలను ఎంపిక చేశామన్నారు. వాటిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్య, వైద్యం సంపూర్ణ స్థాయిలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీఎంఏవై 2.0’ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ,అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ ఎ.మలోల, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
‘ఓపెన్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పదో తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ బాధ్యతలను డీఆర్ఓ నిర్వర్తించాలన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పరీక్షలను పర్యవేక్షించాలని సూచించారు.
కలెక్టర్ వినోద్కుమార్