అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతిపై అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతిపై అనుమానాలు

Mar 17 2025 9:50 AM | Updated on Mar 17 2025 11:27 AM

బుక్కరాయసముద్రం: మండలంలోని జంతలూరు వద్ద ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలో కాంట్రాక్ట్‌ వద్దతిలో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ యోజితా సాహో (27) మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బీకేఎస్‌ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌ జిల్లా దుర్గ్‌ గ్రామానికి చెందిన యోజిత సాహో బుక్కరాయసముద్రంలోని తాను నివాసముంటున్న అద్దె గృహంలో శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రాయ్‌పూర్‌ నుంచి ఆదివారం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూడగానే బోరున విలపించారు. అనంతరం ఆమె అద్దెకున్న ఇంటిని పరిశీలించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఈ సందర్భంగా వారు పోలీసులకు తెలిపారు. కుమార్తె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా అనంతపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, బీకేఎస్‌ సీఐ కరుణాకర్‌ కేసు నమోదు చేశారు. మృతురాలి ఐ ఫోన్‌, లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో యోజితా మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలివెళ్లారు.

అంగన్‌వాడీలకు అందని నూనె

తాడిపత్రి రూరల్‌: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలకు వంట నూనె ప్యాకెట్లు అందలేదు. సగానికి పైగా కేంద్రాలకు నూనె ప్యాకెట్లు అందక పోవడంతో లబ్ధిదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రతి నెలా మొదటి వారంలో పంపిణీ కార్యక్రమం పూర్తి అవుతుంది. కానీ ఈ నెల రెండవ వారం దాటుతున్న కొన్ని కేంద్రాలకు పంపిణీ చేయకపోవడం గమనార్హం. గతంలోనూ పలుమార్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు, వంట నూనె పంపిణీలో వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. ఈ లోపాన్ని సరిదిద్దడంలో అధికారులు విఫలమవుతూ వస్తున్నారు. నూనె ప్యాకెట్లు లేకపోవడంతో ఇతర సరుకులు సైతం తీసుకునేందుకు లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. వీటి కోసం గర్భిణులు, బాలింతలు రోజూ అంగన్‌వాడీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశంపై తాడిపత్రి స్టాక్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌ శంకరయ్య మాట్లాడుతూ.. రేషన్‌ డీలర్లకు సంబంధించిన ఈ–పాస్‌ మిషన్లకు స్టాక్‌ను అప్‌డేట్‌ చేయకపోవడంతో సమస్య తలెత్తినట్లు వివరించారు. డీఎం కార్యాలయంలో అప్‌డేట్‌ చేసిన వెంటనే డీలర్ల వద్ద ఉన్న ఈ–పాస్‌ మిషన్ల ద్వారా పంపిణీ జరుగుతుందన్నారు.

పథకాల అమలులో ప్రభుత్వం విఫలం : సీపీఐ

పెద్దవడుగూరు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి పెద్దలు పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌, కార్యవర్గ సభ్యుడు రాజారెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగప్ప, మండల కార్యదర్శి వెంకట్రాముడుయాదవ్‌ ధ్వజమెత్తారు. పెద్దవడుగూరు సీపీఐ మండల శాఖ మహాసభ ఆదివారం నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలకు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు బీటుపల్లి నారాయణ, తాడిపత్రి సీపీఐ టౌన్‌ కార్యదర్శి చిరంజీవియాదవ్‌, గుత్తి మండల కార్యదర్శి రాందాస్‌, గుత్తి పట్టణ కార్యదర్శి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement