నేడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం | - | Sakshi
Sakshi News home page

నేడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం

Mar 15 2025 12:20 AM | Updated on Mar 15 2025 12:20 AM

నేడు

నేడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం

●తూకాలు, కొలతలు, వస్తు నాణ్యతలో తస్మాత్‌ జాగ్రత్త ●మోసాలను అడ్డుకోకపోతే తప్పదు భారీ మూల్యం

అనంతపురం /అనంతపురం కల్చరల్‌: అనంతపురంలో కలెక్టరేట్‌ సమీపంలోని పెన్నార్‌ భవన్‌కు ఎదురుగా ఒక వినియోగదారుడు కిలో ఆపిల్‌ పండ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. అనుమానం వచ్చి ఎలక్ట్రికల్‌ వేయింగ్‌ మెషిన్‌లో చూడగా 800 గ్రాములు మాత్రమే వచ్చింది. పాతూరులో ఓ వినియోగదారుడు మూడు కేజీల ఉల్లిపాయలు కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి ఎలక్ట్రానిక్‌ వేయింగ్‌ మెషిన్‌లో చూడగా 2.5 కేజీలు మాత్రమే ఉన్నాయి. ఇలా వీరిద్దరే కాదు ప్రతిచోటా సరుకు తూకాలు, కొలతలు, నాణ్యత తదితర విషయాల్లో వినియోగదారులు బోల్తాపడుతూనే ఉన్నారు. సేవల్లో లోపాలున్నా భరిస్తూనే ‘ఇదంతా మూమూలే’ అనుకుని సర్దుకుపోతున్నారు. ఇలాంటి సమయాల్లో వినియోగదారులకు అండగా అనేక చట్టాలు, కమిషన్లు పనిచేస్తున్నాయి. ఏ మాత్రం ఖర్చు లేకుండానే మధ్యవర్తిత్వం ద్వారానో, కమిషన్‌ ద్వారానో న్యాయ పోరాటం చేసి నాణ్యమైన వస్తు సేవలను పొందవచ్చు. జిల్లాలో పదుల సంఖ్యలో వినియోగదారుల సంఘాలుండేవి. 2016 తర్వాత వాటిలో చురుగ్గా పనిచేసే 18 సంఘాల వారు ఏకమై ‘వినియోగదారుల సంఘాల సమాఖ్య’ ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించే సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మార్చి 15న ‘అంతర్జాతీయ వినియోదారుల హక్కుల పరిరక్షణ దినం’ నిర్వహించుకుంటున్నాం.

ఫిర్యాదు చేయండిలా..

వినియోగదారులు ఎవరైనా మోసపోయినపుడు తెల్ల కాగితంపై అర్జీ రాసి జిల్లా స్థాయిలో డీసీఐసీ, మండల స్థాయిలో ఎంీసీఐసీ ద్వారా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కొనుగోలు చేసినట్లు రసీదు కచ్చితంగా ఉండాలి. విక్రయించే ప్రతి వస్తువుపైనా ఎంఆర్‌పీ, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ డేట్‌, వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు చెందిన నంబరు విధిగా ముద్రించి ఉండాలి. అలా లేని పక్షంలో వస్తువుల విక్రయ దుకాణాలపై ప్రభుత్వం జరిమానా విధించాలి. అనుమతి లేకుండా సినిమా టికెట్లు అధిక ధరలకు అమ్మినా, తూకాల్లో తేడాలున్నా, సేవల్లో లోపాలను పసిగట్టినా.. ప్రశ్నించి న్యాయం పొందడానికి చట్టాలపై అవగాహన ఉండాలి.

వినియోగదారులు మోసపోతే తగిన ఆధారాలతో వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం–2019 ద్వారా పరిహారం పొందవచ్చు.

జిల్లా కమిషన్‌ ఎదుట కోటి రూపాయల పరిహారం లోపు.

రూ. కోటి నుంచి రూ.10 కోట్ల మధ్య రాష్ట్ర కమిషన్‌ ఎదుట.

రూ.10 కోట్ల పైబడిన కేసులు జాతీయ కమిషన్‌ ఎదుట దాఖలు చేయవచ్చు.

వినియోగదారులు ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది.

సందర్భం

బ్రహ్మసముద్రం గ్రామానికి చెందిన ఎరుకల అంజనప్ప గతేడాది సత్తార్‌ అనే వ్యాపారి వద్ద వేరుశనగ విత్తనం కొన్నాడు. నాసిరకం విత్తనం కావడంతో పంట పూర్తిగా నష్టపోయాడు. జరిగిన నష్టాన్ని వినియోగదారుల సంఘం ద్వారా పోరాడి ఎకరాకు రూ.15 వేల చొప్పున నష్టపరిహారం పొందాడు. రశీదు ఉండడంతో వినియోదారు సమాఖ్య ద్వారా న్యాయపోరాటం చేయగలిగాడు.

రాయదుర్గంలో విశ్రాంత హెచ్‌ఎం సత్యనారాయణ తన ఇంటి వద్ద తోట ఏర్పాటు చేసుకుని, సపరేటు మీటర్‌ ద్వారా కరెంటు వినియోగిస్తున్నారు. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కమర్షియల్‌ కేటగిరీ కిందకు మార్చేసి రూ.400 వచ్చే బిల్లును ఏకంగా రూ.11 వేలకు ఇచ్చారు. బిల్లు చెల్లించలేదని కరెంటు సరఫరా నిలిపివేశారు. అధికారులకు అడిగినా లాభం లేకపోవడంతో వినియోగదారు సమాఖ్య ద్వారా మధ్యవర్తిత్వం చేయించారు. కరెంటు సరఫరా పునరుద్ధరణతో పాటు గతంలో ఎంత బిల్లు వచ్చేదో ఇప్పుడూ అంతే బిల్లు వస్తోంది.

నేడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం 1
1/1

నేడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement