కూడేరు: తాగునీటి ఇక్కట్లు తీర్చాలంటూ కూడేరు మండలం ముద్దలాపురానికి చెందిన కామ్రేడ్ లక్ష్మీదేవమ్మ కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు మాట్లాడుతూ... లక్ష్మీదేవమ్మ, జగనన్న కాలనీకి రెండింటికీ కలిపి మంచి నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన బోరుబావిలో నీటి మట్టం తగ్గి తాగునీటి సమస్య జఠిలంగా మారిందన్నారు. గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. కాలనీ పక్కనే వెళ్లిన సీపీడబ్ల్యూఎస్ స్కీం పైపులైన్ ద్వారా పైపులైన్ ఏర్పాటు చేసిన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ కార్యాలయ సూపరింటెండెంట్ కేశవకు వినతి పత్రాన్ని అందజేశారు.
నేరాలు అరికట్టేలా సమష్టి కృషి
అనంతపురం: నేరాలు అరికట్టేందుకు సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ పి.జగదీష్ పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ అనర్థాలు, మహిళల పట్ల వేధింపులు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని పలు స్వచ్ఛంధ సేవా సంస్థల (ఎన్జీఓ) ప్రతినిధులతో బుధవారం ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. బాల్య వివాహాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, పోక్సో మహిళా సంరక్షణ చట్టాలు తదితర అంశాలపై ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. డ్రగ్స్ అనర్థాలపై యువతను చైతన్య పరిచేలా ఎన్జీఓలు కృషి చేయాలన్నారు. అనంతరం సైబర్ సురక్షలో భాగంగా ప్రజల్లో అవగాహన తేవడానికి రూపకల్పన చేసిన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సైబర్ సీఐ జాకీర్, వివిధ స్వచ్ఛంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
చింత పండు ధర తగ్గుముఖం
హిందూపురం అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్లో బుధవారం 1573.50 క్వింటాళ్ల చింత పండు విక్రయానికి రాగా... మీడియం ప్లవర్ రకం క్వింటా గరిష్టం రూ. 13వేలు, కనిష్టం రూ.4,300 చొప్పున సగటున రూ.6వేలతో అమ్ముడుపోయింది. అలాగే కరిపులి (ఫైన్) క్వింటా గరిష్టం రూ.33వేలు, కనిష్టం రూ.8వేలు, సగటు రూ.15వేలు చొప్పున ధర పలికింది. గత సోమవారం క్వింటా కరిపులి గరిష్ట ధర రూ.40వేలు కాగా, బుధవారం రూ.33వేలకు చేరుకోవడం గమనార్హం.
తాగునీటి ఇక్కట్లు తీర్చండి