ఇదో రైతు బిడ్డ వ్యధ. హలం పట్టి పొలం దున్నే సమయంలో ప్రజల ఆకలి దప్పికలు తీర్చే ఆలోచన తప్ప మరొకటి లేదు. వరుస పంట నష్టాలను తాళలేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో డ్రైవర్గా మారినా ప్రజల దాహార్తీని తీర్చడం మరువలేదు. పది మంది మంచిగా ఉంటే చాలనే మంచి మనసు అన్నదాతకు తప్ప మరెవ్వరకూ లేదని అని నిరూపించారు ఓబుళదేవరచెరువు మండలం సున్నంపల్లికి చెందిన దూదేకుల ఇమాములు. కాలం కలసి రాక వ్యవసాయం మాని 30 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని అనంతపురానికి చేరుకున్న ఇమాములు ఆటో డ్రైవర్గా మారాడు. ఇద్దరు పిల్లలకు ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. ఏటా వేసవి వచ్చిందంటే చాలు.. తన ఆటోలో చల్లని మంచినీటి ట్యాంక్ను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. ‘నేను రైతు బిడ్డను. చల్లని తాగునీరు ఉచితం’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని రైతు సంక్షేమాన్ని మరవొద్దంటూ నేటి తరానికి ఆయన అందిస్తున్న సందేశం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
– అనంతపురం సిటీ