నర్సీపట్నం: బయో ఫెర్టిలైజర్స్(జీవ ఎరువులు) వాడకం వల్ల నేల ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ శాఖ ఏవో విజయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలో ధర్మసాగరంలో ఆత్మ ఆధ్వర్యంలో జీవ ఎరువుల వినియోగం, ఆవశ్యకత గురించి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా వీటిని వాడటం వల్ల రైతులు మంచి లాభాలు పొందుతారన్నారు. బయో ఫెర్టిలైజర్స్ వాడకం వల్ల ఆహార పంటల్లో పోషక విలువలు పెరుగుతాయన్నారు. భూసారం దెబ్బతినకుండా ఉండి రసాయన ఎరవుల ఖర్చు తగ్గుతుందన్నారు. మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల గురించి అవగాహన కల్పించారు. జిల్లా వనరుల కేంద్రం అనకాపల్లి ఏవో పి.విజేత నేల సారం గురించి అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల నేల సారం తగ్గి భవిష్యత్తులో దిగుబడి తగ్గుతుందన్నారు. నేల పరీక్షల ఆధారంగా బయోఫెర్టిలైజర్స్ ఎరువులను వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో సుర్ల అప్పలనాయుడు, పెట్ల శ్రీనువాసు, వ్యవసాయ అసిస్టెంట్ కె.భవాని, రైతులు పాల్గొన్నారు.


