సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
గెడ్డలో ఊట నీటిని సేకరిస్తున్న మదనగరువు గిరిజనులు
అనకాపల్లి : కార్యకర్తలే మన పార్టీకు అత్యంత బలమని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. ఆదివారం కశింకోట మండలం తేగాడ గ్రామంలో గల ఎస్ఆర్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం సమావేశం ప్రారంభించారు. పార్టీ సంస్థాగత కమిటీలు జిల్లాలో పూర్తయ్యాయని, జిల్లాలో సుమారుగా 57వేల మందిని పార్టీ వివిధ కమిటీల్లో నియమించడం జరిగిందని రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు చెప్పారు.
పబ్లిసిటీపై ఉన్న వ్యామోహం..పథకాల అమలుపై లేదు..
అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వానికి పబ్లిసిటీ వ్యామోహం తప్ప సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండానే సూపర్ హిట్ పబ్లిసిటీ చేయించుకుంటున్న చంద్రబాబును చూసి ప్రజలు నవ్విపోతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలో రూ. 4,600 కోట్లతో చేపట్టిన మూలపేట పోర్టు పనులు నాడే సుమారుగా 60 శాతం పూర్తి అయినా ఈ రెండేళ్ల పాలనలో పనులు నిలుపుదల చేశారన్నారు. మా ప్రభుత్వంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమరావతితో పాటు విశాఖ, కర్నూలు అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడితే అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నాయకులు అమరావతి అభివృద్ధి కోసం మాట్లాడలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ రాజధానిగా 10 సంవత్సరాలు ఉండగా, ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుఅడ్డంగా దొరికిపోవడంతో అక్కడ నుంచి పారిపోయి అమరావతికి రావడం జరిగిందన్నారు. విశాఖలో రూ.5 వేల కోట్ల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారన్నారు.
అసెంబ్లీ సీట్ల పెంపుతో వైఎస్సార్సీపీకే మేలు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డీనేటర్ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 263 అసెంబ్లీ స్థానాలను పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, దీనివల్ల వైఎస్సార్సీపీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. నక్కపల్లి కేంద్రంగా ప్రైవేట్ స్టీల్ప్లాంట్ను వైఎస్సార్సీపీ హయాంలో తీసుకొస్తే ఒక జూమ్కాల్ తో తానే తెచ్చినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నాడంటూ మండిపడ్డారు. అనకాపల్లి పట్టణంలో రూ.100 కోట్ల విలువైన కన్యకాపరమేశ్వరి దేవస్థానం భూమి కూటమి నాయకులు భూమిని స్వాహా చేయాలని చూడడంతో దానిపై వైఎస్సార్సీపీ పోరాడిందన్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్లబాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీగా పాలన సాగుతుందన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా పాలన చేస్తున్నారన్నారు. కేంద్రంలో మహిళలకు చట్టసభలో 30 శాతమా లేదా 33 శాతమా అనేదానిపై చర్చ జరుగుతుందన్నారు.
బొడ్డేడకు ఘఽన సన్మానం
జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన తరువాత తొలిసారిగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా బొడ్డేడ ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, మలసాల భరత్కుమార్, అదీప్రాజ్, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, సూర్యనారాయణరాజు, శరగడం చిన అప్పలనాయుడు, సీఈసీ సభ్యులు బి.వి.సత్యవతి, రమణమూర్తిరాజు, కోలా గురువులు, నియోజకవర్గ పరిశీలకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, గండి రవికుమార్, పైలా శ్రీనివాసరావు, సతీష్వర్మ, దంతులూరి దిలీప్కుమార్, ఏడువాక సత్యారావు, వీసం రామకృష్ణ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, ఉత్తరాంధ్ర జిల్లాల జేసీఎస్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్రెడ్డి, పార్టీ జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
సమస్యలపై పోరాటం చేయాలి : కన్నబాబు
విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ మీ పరిధిలో స్థానిక ప్రజా సమస్యలు, కూటమి వైఫల్యాలపై పోరాటం చేయాలని సూచించారు. వచ్చే నెలలో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరం సిద్ధంగా ఉండాలన్నారు. ఇటీవల మాకవరపాలెం మెడికల్ కళాశాల పరిశీలనకు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి వస్తే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, పోలీసులు అడ్డుకున్నా ప్రజలు బ్రహ్మరథం పట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమిలో కుమ్ములాటలు ఉన్నాయని, వై.ఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి భయపడి కలిసి ఉన్నట్టు నటిస్తున్నారన్నారు.
గ్రామస్థాయి నుంచి పార్టీ మరింత బలోపేతమే లక్ష్యం
సంస్థాగత నిర్మాణ కమిటీల ఎంపిక దాదాపుగా పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా
సన్నద్ధంగా ఉండాలి
శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ,
వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు


