తూతూ మంత్రంగానే నోటీసులు
నిందితులను ప్రోత్సహిస్తున్న కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు
పోలీసులు చర్య తీసుకోకుంటే
ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేతలు
తగరంపూడిలో ధ్వంసమైన గురునాథరావు విగ్రహం పరిశీలన
పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరసన ర్యాలీ
అనకాపల్లి టౌన్ : మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను, అందుకు ప్రోత్సహించిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లిలో తగరంపూడి గ్రామంలో ఇటీవల ధ్వంసం చేసిన గురునాథరావు విగ్రహం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్తలతో కలిసి ముత్యాలనాయుడు నిరసన తెలియజేశారు. నిరసనలో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ ఆగడాలు నశించాలి..గురునాథరావు విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని నినదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు మీడియాతో మట్లాడుతూ ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఇప్పుడు మాజీ మంత్రి గురునాథరావు విగ్రహం ధ్వంసం వంటి చర్యలకు కూటమి నేతలు పాల్పడడం బాధాకరం అన్నారు. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయకపోవడం అన్యాయమన్నారు. కులాలకు, పార్టీలతీతంగా నాలుగు దశాబ్దాల రాజకీయ నేపఽథ్యం ఉన్న నాయకుడు..అందరికీ అభిమానపాత్రుడైన దివంగత గురునాథరావు విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న వారిని ఇక్కడి స్థానిక కూటమి నాయకులు కాపాడడం దారుణమన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు రామచంద్రరావు ఘటనపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. హడావుడిగా కొందరు వ్యక్తులకు నోటీసులు ఇచ్చి ఊరుకోవడం అన్యాయమన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారిని, వారిని ప్రోత్సహించిన వారిని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్ ఉద్యమ కార్యచరణను ప్రటిస్తామంటూ హెచ్చరించారు.
అనకాపల్లి అసెంబ్లీ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ మాట్లాడుతూ సంఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసేవరకు తమ పోరాటం ఆగదన్నారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ విగ్రహాల ధ్వంసం చేసిన నిందితులను స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్లు ప్రోత్సహించడం తగదన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్రాఉ. గ్రామస్తుల సాక్షిగా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జనసేన నాయకుడు భరత్బాబును ఇంత వరకు విచారణ చేయలేదంటే కూటమి నేతల కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారని అర్ధమవుతోందన్నారు. ఈ నిరసనలో
మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, చింతలపూడి వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పైలా శ్రీనివాసరావు, దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగ లక్ష్మి గున్నయ్య నాయడు, పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీ రామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ నాయకులు బొడ్డేడ శివ, కె.ఎం.నాయడు, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ పాల్గొన్నారు.


