తుమ్మపాల : ప్రజల ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ కోరారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (బ్యాంకర్ల సమావేశం) జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం చేస్తున్న పథకాలకు అనుగుణంగా ఔత్సాహికులకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. విద్యా రుణాలు, ఎంఎస్ఎంఈలకు పీఎం సూర్య ఘర్ పథకాలకు, వ్యవసాయ రుణాలు, ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ కింద విరివిగా రుణాలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. రుణాలు అందించడంలో అన్ని బ్యాంకులు లక్ష్యాలు సాధించాలన్నారు. సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలని అన్నారు. అధికారులు, ఎస్హెచ్జి మహిళలు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రుణాల మంజూరులో సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యా రుణాల పట్ల విద్యార్థులలో అవగాహన కలిగించి ప్రోత్సహించాలన్నారు. పీఎం సూర్యఘర్ రుణాలను పెంచాలని, తద్వారా సోలార్ విద్యుత్ వినియోగం పట్ల ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. వ్యవసాయ రుణాల మంజూరు, రెన్యువల్ సమయాల్లో రీ సర్వే వల్ల ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే రెవెన్యూ అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. అంతకుముందు నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని (2026–27) ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వై.సత్యనారాయణ రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ శచీదేవి, పలు బ్యాంకుల మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


