అచ్యుతాపురం రూరల్ : పునరావాసం కల్పించకుండా గ్రామం నుంచి ఖాళీ చేసేది లేదంటూ దుప్పితూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గురువారం దుప్పితూరు గ్రామస్తులు అఖిలపక్ష నాయకుల మద్దతుతో బ్రాండిక్స్ ఆవరణలో గ్రామానికి చెందిన చిట్టి పైడితల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆందోళన చేశారు. ఏపీఐఐసీ అధికారులు దుప్పితూరు గ్రామం మధ్యలో ప్రహరీ చుట్టూ ఉన్న నిర్వాసిత ప్రజలను ఖాళీ చేయాలని భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. గ్రామ దేవతలు, శివాలయం, శ్మశాన వాటిక, దేవదాయ భూములు, దుప్పితూరు గ్రామ ప్రజలకు పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజ్, గ్రామ కంఠంలో ఉన్న నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని తరలించకుండా ఏపీఐఐసీ అధికారులు గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగుతున్నారన్నారు. గ్రామం చుట్టూ ప్రహరీ కట్టడం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి దుప్పితూరు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో దుప్పితూరు సర్పంచ్, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, ఇతర పార్టీ నాయకులు, దేశంశెట్టి వెంకటరమణ, దేశంశెట్టి పైడియ్యనాయుడు, గ్రామ పెద్దలు దేశంశెట్టి తాతియ్యలు, దేశంశెట్టి ఈశ్వర్రావు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు శెట్టి నాగేశ్వర్రావు, శెట్టి కాసుబాబు, ప్రగడరాజు, దేశంశెట్టి కాసుబాబు, ప్రగడ ఈశ్వర్రావు, ప్రగడ కొండలరావు, మాడెం సూరి అప్పారావు పాల్గొన్నారు.


