దేవరాపల్లి టిఫిన్ సెంటర్ల తనిఖీ చేస్తున్న సీఎస్డీటీ ఎ.రవిబాబు
దేవరాపల్లి : దుకాణాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగించిన ఇద్దరు వ్యక్తులపై సివిల్ సప్లయి అధికారులు 6ఏ కేసులు నమోదు చేశారు. గ్యాస్ కొరత నేపథ్యంలో సివిల్ సప్లయి అధికారులు మండలంలో పలు హోటళ్లు, దాబా, టిఫిన్, టీ దుకాణాలపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కమర్షియల్ గ్యాస్కు బదులుగా డొమెస్టిక్( గృహ అవసరాల గ్యాస్) గ్యాస్ను వాడుతున్నట్టు గుర్తించారు. దేవరాపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వాహకుడిపైన, కాశీపురంలో దాబా యజమానిపైన 6ఏ కేసులు నమోదు చేసి, రెండు సిలిండర్లను సీజ్ చేసినట్టు సివిల్ సప్లయి డిప్యూటీ తహసీల్దార్ ఎ. రవిబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని, గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య సముదాయాలలో వినియోగిస్తే క్రిమినల్ కేసులు సైతం పెట్టేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. మాడుగుల నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నామని, కె.కోటపాడు మండలంలో నిర్వహించిన దాడుల్లో నలుగురిపై కేసులు నమోదు చేసి, 13 సిలిండర్లను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఆయన వెంట వీఆర్వో బి. నాగేశ్వరరావు తదితర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.


