తుమ్మపాల : డ్రగ్స్, గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాదకద్రవ్యాలు, గంజాయి నియంత్రణ, నార్కో కో– ఆర్డినేషన్ సెంటర్ అవగాహన కార్యక్రమాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్పీ తుహిన్ సిన్హాలతో కలిసి ఆమె జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డీ–అడిక్షన్ సెంటర్ పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు అక్రమంగా టొబాకో ఉత్పత్తులు సరఫరా చేస్తున్న వారిపై టాక్స్, ఫుడ్ సేఫ్టీ, పోలీస్, ఈగల్ ఇతర శాఖలు కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్కి సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కమిటీలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, గంజాయి వినియోగం, విక్రయాలపై వెంటనే సమాచారం అందించాలని అన్నారు.
రైల్వేస్టేషన్, రైళ్లలో, బస్టాండ్లలో నిరంతరం గస్తీ నిర్వహించాలని పోలీస్, ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రమం తప్పక నషా ముక్త్ భారత్ కార్యక్రమాలను చేపట్టాలని, ప్రతి హాస్టల్లో డ్రగ్స్ గంజాయిపై అవగహన కల్పించాలని, పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆన్లైన్ ద్వారా అక్రమంగా ఎన్ఆర్ఎక్స్ మెడిసిన్స్ ఆర్డర్ చేసి విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ జిల్లాలో పోలీస్, ఎకై ్సజ్ శాఖలు సమన్వయంతో తనిఖీలు చేపట్టి రోజువారీగా కేసులు నమోదు చేస్తున్నాయని తెలిపారు. నర్సీపట్నం మండలం డౌనూరు, వి.మాడుగుల మండలం తాడిపర్తి, చిడికాడ మండలం కోనాం, డౌనూరు, కేడీపేట మండలం భీమవరం, దేవరపల్లి మండలం శ్రీరాంపురం ప్రాంతాల్లో శాశ్వత చెక్పోస్టులు ఏర్పాటు చేసి, జిల్లా వ్యాప్తంగా 38 వాహన తనిఖీ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 158 కేసులు నమోదై, 492 మందిని అరెస్ట్ చేసి, 9,726 కిలోల గంజాయి, 145 వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, జిల్లా రవాణా, ప్రజా రవాణా, వ్యవసాయ, విద్యా, అటవీ, వెనుకబడిన, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఆర్డీఓ షేక్ అయిషా, డీఎస్పీ ఎం.శ్రావణి, రైల్వే, జీఆర్పి, ఈగల్ శాఖల పోలీసులు పాల్గొన్నారు.


