బడ్జెట్ వట్టి బూటకం
● ప్రజలను నిలువునా మోసం చేశారు
● ప్రకటించిన హామీలకు నిధులేవీ..
● హామీలన్నీ అమలు చేసిన
ఘనత వైఎస్సార్సీపీదే
● మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు
నక్కపల్లి: ఎన్నికల సందర్భంగా ప్రకటించిన హామీలకు, పథకాలకు పూర్తి స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు జరిపిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు అన్నారు. సోమవారం ఆయన నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వట్టి బూటకమన్నారు. ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. నిధుల కేటాయింపులో ప్రజలను మోసం చేసారన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ పేరుతో ఎన్నో హామీలను గుప్పించారన్నారు. వీటన్నింటిని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. ఆడబిడ్డనిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు చెల్లిస్తామన్నారు. వీటికి పైసా కూడా నిధులు కేటాయించలేదన్నారు. నిధులు కేటాయించే ఉద్దేశం లేనప్పుడు ప్రజలను ఎందుకు మోసం చేశారని నిలదీసారు. మొదటి ఏడాది అమ్మఒడి, రైతు భరోసా ఎగ్గొట్టేసారని, రెండో ఏడాదైనా సరే పూర్తిగా నిధులు విడుదల చేయలేదని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన, తొలి ఏడాదిలోనే పథకాలన్నింటిని అమలు చేసి వాటికి సరిపడా నిధులు కేటాయించారన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క పథకం కూడా నిలిచిపోకుండా అమలు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో ఏకపక్షంగా తమకు అనుకూలమైన బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నాల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందన్నారు.


