
తాండవ నీటిమట్టం 370.10 అడుగులు
తాండవ ప్రాజెక్టులో పెరుగుతున్న నీటి మట్టం
నాతవరం: తాండవ రిజర్వాయరులో నీటిమట్టం క్రమేపి పెరుగుతుందని ప్రాజక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ నీటిమట్టాన్ని పరిశీలించారు. తాండవ కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. గురువారం సాయంత్రానికి రిజర్వాయరులో నీటిమట్టం 370.10 అడుగులకు చేరిందన్నారు. 350 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుందన్నారు. ప్రమాదస్థాయి నీటిమట్టం 380.0 అడుగులుగా పరిగణిస్తామన్నారు. రెండు జిల్లాల్లోని 52 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరు సరఫరా చేయాలంటే ప్రాజెక్టులోకి మరింత నీరు చేరాలన్నారు. వచ్చే నెల 10 నుంచి 15వ తేదీలోపు ఆయకట్టుకు నీరు విడుదల చేయడానికి ఇటీవల నీటి సంఘాలు తీర్మానించాయన్నారు.