
జనం మధ్య జగన్నాథుడు
అంగరంగ వైభవంగా తొలి రథయాత్ర
సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడు రథంపై కొలువుదీరారు. స్వామి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. రథం లాగేందుకు పోటీ పడ్డారు. గవరపాలెం మర్రిచెట్టు వద్ద కొలువైన శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి తొలి రథయాత్ర శుక్రవారం ఘనంగా జరిగింది. ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని అధిష్టింపజేశారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వామివారికి పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. రథం ఆలయం నుంచి గవరపాలెం పురవీధుల మీదుగా చిననాలుగురోడ్ల జంక్షన్, కోట్నివీధి, మళ్ల వీధి మీదుగా సాగి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంద్రద్యుమ్న హాల్కు చేరుకుంది. ఇక్కడ తొమ్మిది రోజులపాటు రోజుకొక అవతారంలో ప్రజలకు స్వామివారు దర్శనమిస్తారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి బుజ్జి, ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో సీఐలు టీవీ విజయ్కుమార్, వెంకటనారాయణ, ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాడుగులలో జగన్నాథుని రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. జగన్నాథస్వామి ఆలయం నుంచి నూతన ఇంద్రద్యుమ్న హాల్ వరకు మంగళ వాయిద్యాలు, భజనల నడుమ కన్నుల పండువగా రథయాత్ర సాగింది. – అనకాపల్లి టౌన్/మాడుగుల

జనం మధ్య జగన్నాథుడు

జనం మధ్య జగన్నాథుడు