
అధికారుల్లో కదలిక
● 5 కి.మీ. నడిచి అర్ల పంచాయతీ చేరుకున్న డీఈవో, తహసీల్దార్, ఎండీపీవో ● ఎన్ఆర్ఎస్టీసీ స్కూలు పునఃప్రారంభానికి హామీ ● అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు సిఫారసు
రోలుగుంట: అర్ల గిరిజన పంచాయతీ శివారు కొండ శిఖరాగ్రాన గల గిరిజన గ్రామాల విద్యార్థుల అవస్థల గురించి తెలుసుకొని అధికారులు స్పందించారు. ఆ చిన్నారుల నడకయాతన గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు వారిలో కదలిక తీసుకువచ్చాయి. జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు శుక్రవారం రోలుగుంట వచ్చారు. ఎంఈ వో జానుప్రసాద్, తహసీల్దార్ ఎస్.నాగమ్మ, ఎంపీడీవో వి.ఎస్.నాగేశ్వరరావులతో కలిసి అయిదు కిలోమీటర్లు పైబడి కొండపైకి కాలినడకన చేరుకున్నారు. పెదగరువు, కొత్తలోసింగి, పాతలోసింగి గ్రా మాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. తమ పిల్లలు చదువు కోసం ఆరు కిలోమీటర్ల దూరంలోని వై.బి.పట్నం, 10 కిలోమీటర్ల దూరంలోని బి.బి.పట్నం గ్రామాలకు కాలినడకన వెళుతున్నారని వారి కష్టాలు చెప్పుకున్నారు. గతేడా ది సెప్టెంబర్లో తమ అభ్యర్థన మేరకు గ్రామంలోనే ఎన్ఆర్ఎస్టీసీ స్కూలు నిర్వహించారని, ఈ ఏడాది పునఃప్రారంభించలేదని వివరించారు. తమ గ్రామాల్లో పూర్తిస్థాయిలో పాఠశాల ఏర్పాటు చే యాలని కోరారు. గతంలో ఈ గ్రామాలకు రూ.2.50 లక్షలు మంజూరైతే తూతూమంత్రంగా పనులు చేశారని, వర్షాలకు కొట్టుకుపోయి య థాస్థితికి వచ్చిందన్నారు. రవాణా మార్గం లేక రో గులను చికిత్స కోసం డోలీలో తరలించాల్సి వస్తుందన్నారు. డీఈవో అప్పారావునాయుడు కొత్తలోసింగి, పాతలోసింగి గ్రామాల్లో ఒకటి నుంచి అయిదు వరకు చదువుతున్న 22 మంది విద్యార్థులు ఉ న్నారని, పెదగరువు గ్రామంలో బడి ఈడు పిల్లలు అయిదుగురు ఉన్నట్టు గుర్తించి వై.బి.పట్నం ఎంపీపీ పాఠశాల హెచ్ఎం ఏకా నర్సింహమూర్తిని రప్పించి హాజరు పట్టీని సరిపోల్చారు. సంతృప్తి చెందిన ఆయన ఎన్ఆర్ఎస్టీసీ స్కూలును మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయిదు సంవత్సరాల లోపు వయసున్న చిన్నారుల కోసం అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్కు నివేదిస్తామని చెప్పారు. గిరిజన సంఘ నాయకులు కె.గోవింద, ఆ గ్రామాల పెద్దలు కిలో నర్సయ్య, వెంకట్రావు పాములు, సత్తిబాబు, సీఆర్పీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.