
పూల కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..
● హైవేలో అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీ ● కడియం నుంచి పూలు తెస్తున్న బొలేరో వ్యాన్ ఢీ ● వ్యాన్ డ్రైవర్ సహా మహిళ దుర్మరణం ● మరో మహిళకు తీవ్ర గాయాలు ● జమాదులపాలెంలో ఘటన
కశింకోట: జమాదులపాలెం జంక్షన్ వద్ద జాతీ య రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి కోల్కత్తాకు వెళ్తున్న కంటైనర్ను బొలేరో వ్యాన్ ఢీకొంది. దాంతో వ్యాన్ డ్రైవర్ సహా ఒక మహిళ దుర్మరణం చెందారు. మరొక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. సీఐ అల్లు స్వామినాయుడు వివరాల ప్రకారం.. కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన పూల వ్యాపారి కన్నూరు లక్ష్మి(40)తోపాటు మరో మహిళ తూర్పు గోదావరి జిల్లా కడియం వద్ద పూలు కొనుగోలు చేసి గాజువాకలో అమ్మకానికి వ్యాన్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న ఈ వ్యాన్ అదేమార్గంలో ముందు వెళ్తూ అకస్మాత్తుగా ఆగిన కంటైనర్ లారీని బలంగా ఢీకొంది. దీంతో కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ పి. సత్యనారాయణ (25), పూల వ్యాపారి లక్ష్మి(40) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి మండలం కోడూరుకు చెందిన పూల వ్యాపారి ఎన్. వరలక్ష్మి (40) తీవ్రంగా గాయపడింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరిన సీఐ స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావులతోపాటు పోలీసులు క్షతగాత్రురాలిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సలహాపై విశాఖ కేజీహెచ్కు తరలించారు.
కేబిన్లో ఇరుక్కున్న మృతదేహాలు..
వ్యాన్ డ్రైవర్ పక్క సీటులో లక్ష్మి కూర్చొంది. దీంతో అతడితోపాటు ఆమె కూడా మృత్యువాత పడింది. ప్రమాదంలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. దీంతో మృతదేహాలు చిక్కుకోవడంతో కేబిన్ నుంచి బయటకు అతికష్టం మీద పోలీసులు వెలికితీసి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ప్రమాదం వల్ల వాహనాల ప్రయాణానికి అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాద వాహనాలను రోడ్డుపై తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
ప్రమాదంలో మృతి చెందిన వారిలో లక్ష్మిది పేద కుటుంబం. భర్త వరహాలు గాజువాక వద్ద కళాసీ పని చేస్తున్నాడు. లక్ష్మి నాలుగేళ్లుగా కడియం నుంచి పూలు తెచ్చి గాజువాకలో అమ్ముకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఆమె పెద్ద కుమార్తె మాధవి తిరుపతిలో డీ ఫార్మసీ, చిన్న కుమార్తె కావేరి స్థానికంగా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లి లక్ష్మి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలు లక్ష్మి భర్త వరహాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కె. లక్ష్మణరావు తెలిపారు.